అక్కడ బయటపడ్డ బంగారు గని.. రూ.12లక్షల కోట్ల నిక్షేపాలు..
ఉత్తరప్రదేశ్లోని సోనభద్ర జిల్లాలో ప్రభుత్వం భారీ బంగారు నిక్షేపాలను గుర్తించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా,ఉత్తరప్రదేశ్ డైరెక్టోరేట్ ఆఫ్ జియోలాజీ & మైనింగ్ అధికారుల అంచనా ప్రకారం.. సోనభద్ర జిల్లాలోని సోన్ పహాడి-హర్ది గ్రామాల మధ్య 3వేల టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నాయి. ఈ నిక్షేపాలను వేలం వేయడం ద్వారా భారీ ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఏడుగురు సభ్యుల బృందాన్ని నియమించిన ప్రభుత్వం.. ఈ-వేలాన్ని చేపట్టనుంది. అలాగే ఈ టీమ్ అక్కడి ప్రాంతం మొత్తాన్ని జియో ట్యాగింగ్ చేసి.. ఫిబ్రవరి 22న నివేదికను డైరెక్టోరేట్ ఆఫ్ జియోలాజీకిసమర్పించనుంది.
Recommended Video
జియోలాజికల్ అధికారులు రాసిన అధికారిక లేఖలో సోన్ పహాడి బ్లాకులో 2943.26 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నాయని.. హర్ది బ్లాకులో 646.15 కేజీల బంగారు నిక్షేపాలు ఉన్నాయని గుర్తించారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం ప్రస్తుతం భారతదేశ గోల్డ్ నిక్షేపాల నిలువ 626 టన్నులు మాత్రమే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ నిక్షేపాలు ఐదు రెట్లు పెద్దవి. వీటి విలువ దాదాపు రూ.12లక్షల కోట్లు.సోనభద్ర జిల్లా చాలా వెనుకబడిన జిల్లా. ఇక్కడ 1992-93 నుంచి బంగారు నిక్షేపాల కోసం అన్వేషణ సాగుతోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కంటే ముందు.. గతంలో బ్రిటీష్ అధికారులు సోనభద్రలో బంగారు నిక్షేపాల కోసం అన్వేషించినట్టు చెబుతారు. రిటైర్డ్ జియోలాజికల్ అధికారి డా.పృథ్వీ మిశ్రా మాట్లాడుతూ.. సోనభద్ర ప్రాంతంలో దాదాపు ఒక కిలో మీటరు పొడవు,18మీ. ఎత్తు,15మీ. వెడల్పుతో బంగారు నిక్షేపాలు ఉన్నాయని చెప్పారు.