ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా పేషెంట్ల మరణాలు.. 24గంటల్లో 306 మంది.. వెంటాడుతున్న ఆక్సిజన్ సమస్య..
దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 306 మంది కరోనాతో మృతి చెందారు. గతేడాది కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ ఒక్కరోజులో సంభవించిన మరణాల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. ఇప్పటివరకూ మొత్తం 13,193 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటికే ఢిల్లీ ఆస్పత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోగా... చాలామంది పేషెంట్లు ఆస్పత్రుల బయటే వైద్యం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలో పడకలు దొరక్క,సకాలంలో ఆక్సిజన్ అందక చాలామంది ప్రాణాలు విడుస్తున్నారు.
ఇవీ కేసుల వివరాలు...
గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా మరో 26 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,56,348కి చేరింది. ప్రస్తుతం 91,618 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా పాజిటివ్ రేటు 36.24శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 48,346 ఆర్టీపీసీఆర్ టెస్టులు,23,862 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు నిర్వహించారు. మరో 19,609 మంది కరోనా పేషెంట్లు రికవరీ అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 8,51,537కి చేరింది.
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత...
ఢిల్లీ ఆస్పత్రుల్లో బెడ్స్ దొరక చాలామంది పేషెంట్లు బయటే ఎదురుచూస్తున్నారు. సకాలంలో ఆస్పత్రిలో బెడ్ దొరక్క ఆస్పత్రి బయటే గంటల పాటు నిరీక్షించాల్సి వస్తుండటంతో పేషెంట్లు నరకం అనుభవిస్తున్నారు. కళ్లెదుటే అయినవాళ్లు అంతలా బాధపడుతుంటే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గురువారం(ఏప్రిల్ 22) ఉదయం నుంచి ఢిల్లీలోని పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత నెలకొంది. సాయంత్రం సమయానికి మొత్తం ఐదు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడిందని.. మరికొన్ని ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ అయిపోవడానికి వచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది.
కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా...
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని గత మూడు రోజులుగా ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూనే ఉంది. ఢిల్లీ హైకోర్టు సైతం కేంద్ర ప్రభుత్వానికి గట్టిగానే అక్షింతలు వేసింది. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా అంటూ మందలించింది. అడుక్కుంటారో... అప్పు చేస్తారో... లేక దొంగతనమే చేస్తారో... ఎలాగైనా సరే ప్రజల జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని కేంద్రానికి గుర్తుచేసింది. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో డిమాండ్కి తగినంత ఆక్సిజన్ను కేంద్రం సరఫరా చేయలేకపోతోంది. రాష్ట్రాలు కోరిన దాని కంటే తక్కువ మొత్తంలో ఆక్సిజన్ సప్లై చేస్తోంది. మరోవైపు దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయని సుప్రీం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సరైన ప్రణాళికతో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలని కేంద్రానికి సుప్రీం సూచించింది.