బీహార్: 3వ దశలో 31శాతం క్రిమినల్స్ -నేరచరితులకు పార్టీల టికెట్లు -ఏడీఆర్ రిపోర్టు
చూస్తుండగానే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రహాసనం తుది అంకం దిశగా పరుగులు తీస్తోంది. మొదటి దశలో భాగంగా గతవారం 71 స్థానాలకు పోలింగ్ పూర్తికాగా, 94 స్థానాల్లో రెండో దశ పోలింగ్ మంగళవారం జరుగనుంది. ఇక నవంబర్ 7న జరుగనున్న మూడో దశ ఎన్నికలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఎన్నికల్లో నేరచరితుల్ని నివారించాలనే లక్ష్యంతో పని చేస్తోన్న స్వచ్ఛంద సంస్థ, పోల్ రైట్స గ్రూప్ ''అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)'' తాజా నివేదికను విడుదల చేసింది. ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలోని వివరాల ప్రకారం ఏడీఆర్ నివేదికలను రూపొందిస్తుంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల 3 వ దశలో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 31 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది. మూడో దశ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి 1,195 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, అందులో 371మంది(31 శాతం మంది) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో ప్రకటించారు.
మూడో ఫేజ్ లోని మొత్తం అభ్యర్థుల్లో 30 శాతం మంది కోటీశ్వరులున్నారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం, ఆర్జేడీ టికెట్లు పొందినవాళ్లలో 73 శాతం మంది, బీజేపీ అభ్యర్థుల్లో 76 శాతం మంది, కాంగ్రెస్ కు చెందిన 76 శాతం మంది క్యాండిడేట్లు నేరచరితులు కాగా, ఎల్జేపీ నుంచి 43 శాతం మంది, బీఎస్పీ నుంచి 26 శాతం మంది నేరచరితులు టికెట్లు పొందారు.