202 మంది కోటీశ్వరులు, 311 మంది క్రిమినల్స్
న్యూఢిల్లీ: కేరళ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 202 మంది కోటీశ్వరులున్నారు. అదేవిధంగా 311 మంది నేరస్తులు ఉన్నారని తాజా సర్వేలో వెల్లడైయ్యింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఈ సర్వే వివరాలను న్యూఢిల్లీలో వెల్లడించారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి 1,203 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారు ఎన్నికల అధికారులకు అఫిడవిట్లు సమర్పించారు. అందులో 1,125 మంది సమర్పించిన పత్రాలను ఏడీఆర్ విశ్లేషించింది. కేరళలో ఈ నెల 16వ తేదిన ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల బరిలో ఉన్న కోటీశ్వరుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 43 మంది ఐఎన్ సీ అభ్యర్థులు, 24 మంది సీపీఎం అభ్యర్థులు, 18 మంది బీజేపీ అభ్యర్థులు, 18 మది భారత్ ధర్మ జనసేన అభ్యర్థులు, ఇద్దరు ఏఐఏడీఎంకే అభ్యర్థులు, 17 మంది ఐయూఎల్ అభ్యర్థులున్నారని ఏడీఆర్ తెలిపింది.
30 మంది స్వతంత్ర అభ్యర్థులు తమకు రూ.కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అధికారులకు అఫిడవిట్లు సమర్పించారు. నేరారోపణలు ఎదుర్కోంటున్న వారిలో 72 మంది సీపీఎం, 42 మంది బీజేపీ, 37 మంది ఐఎన్ సీ, 15 మంది సీపీఐ, 25 మంది ఎస్పీడీఐ అభ్యర్థులు ఉన్నారు.
834 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉంటూ ఆదాయ వివరాలు వెల్లడించలేదు. 669 మంది అభ్యర్థుల విద్యార్హతలు 5 నుంచి 12 వ తరగతుల (ఇంటర్) మధ్య ఉన్నాయి. 380 మంది అభ్యర్థులు డిగ్రీలు, పీజీలు చేశామని ప్రకటించారు. 29 మందికి చదవడం మాత్రమే వచ్చు. ఏడుగురు నిరక్షరాస్యులు ఉన్నారు. 104 మంది మహిళలు బరిలో ఉన్నారని సర్వేవెల్లడించింది.