31 వ రోజుకు రైతుల ఆందోళన: కేంద్రంతో చర్చలకు రైతుల అంగీకారం, ఈ నెల 29న మరో దఫా చర్చలు
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోనూ, ఢిల్లీ సరిహద్దులోని రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల ఆందోళనలు ఈరోజుతో 31 వ రోజుకు చేరుకున్నాయి. చలి తీవ్రత పెరుగుతున్నప్పటికీ రైతులు వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. మూడు వ్యవసాయ చట్టాలపై తమ మధ్య ఉన్న ప్రతిష్టంభనను పరిష్కరించడానికి చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం ఇటీవల రాసిన లేఖపై చర్చించడానికి నిరసన వ్యక్తం చేసిన రైతులు ఎట్టకేలకు చర్చలకు రెడీ అంటున్నారు.
ప్రభుత్వంతో , నిలిచిపోయిన చర్చలను పునః ప్రారంభించాలని కేంద్రం ఆహ్వానంపై నిర్ణయం తీసుకున్న రైతులు
ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తూ రాసిన లేఖపై రైతులు శుక్రవారం సమావేశమయ్యారు, కాని దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై కొనసాగుతున్న ప్రతిష్టంభనకు పరిష్కారం కోసం వారు ప్రభుత్వంతో చర్చలు తిరిగి ప్రారంభించవచ్చని కొందరు రైతు నాయకులు సూచించారు. ఈ క్రమంలోనే సమావేశమైన రైతు సంఘాల నాయకులు ప్రభుత్వంతో , నిలిచిపోయిన చర్చలను తిరిగి ప్రారంభించాలని కేంద్రం ఆహ్వానంపై అధికారిక నిర్ణయం తీసుకున్నారు.
డిసెంబర్ 29 న ఉదయం 11 గంటలకు కేంద్ర ప్రభుత్వంతో తదుపరి రౌండ్ చర్చలకు రైతు సంఘాలు రెడీ
రైతులు ప్రభుత్వం చెప్పిన వేటినీ అంగీకరించకపోవటంతో రైతుల నిరసన రాజకీయ ఎజెండాతోనే అని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు . అందరితో సంభాషణలు నిర్వహించడానికి తమ ప్రభుత్వం సుముఖంగా ఉందని మోడీ నొక్కి చెప్పారు. అయినా రైతులు చర్చలకు ముందుకు రావడం లేదని విమర్శించడంతో స్వరాజ్ ఇండియా కన్వీనర్ యోగేంద్ర యాదవ్ శనివారం సింగు సరిహద్దులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, డిసెంబర్ 29 న ఉదయం 11 గంటలకు కేంద్ర ప్రభుత్వంతో తదుపరి రౌండ్ చర్చలు జరపడానికి రైతు సంఘాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
రైతుల ఆందోళనల్లో హర్యానా రాష్ట్రంలో టోల్ ప్లాజాల ముట్టడి
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్కు రాసిన లేఖలో సంయుక్త కిసాన్ మోర్చా ఇదే విషయాన్ని ప్రతిపాదించారు. ఇక రైతులు నిరసనలో భాగంగా నేటి నుండి హర్యానా రాష్ట్రంలో టోల్ ప్లాజాలను ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా రైతులకు మద్దతు తెలుపుతూ కార్యకర్తలతో అహ్మదాబాద్ నుంచి ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు .
ఆందోళన విరమించని రైతులకు మద్దతు.. నిత్యావసరాలతో ఢిల్లీకి భారీగా రైతులు
ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతుల ఆందోళనకు మద్దతుగా పలువురు రైతులు కావలసిన నిత్యావసర వస్తువులను తీసుకుని ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు బయలుదేరారు.వ్యవసాయ చట్టాల రద్దు కే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న రైతులు కేంద్రం ఏం చెప్పినా అంగీకరించే ఆలోచనలో లేరు. ఈ ఒక్క ఏడాది వ్యవసాయ చట్టాల అమలు తీరును చూసి అప్పటికీ నష్టం జరుగుతుంది అంటే అప్పుడు నిర్ణయం తీసుకోమని కేంద్రం చెప్తుంది. కానీ రైతులు ఇప్పుడే వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.