పగబట్టిన కాలుష్యం: దేశ రాజధాని అతలాకుతలం.. విమానాలపైనా ఎఫెక్ట్..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని అతలాకుతలమౌతోంది. ఊపిరి పీల్చుకోలేని స్థితికి దిగజారింది. కొద్ది రోజుల కిందట న్యూఢిల్లీని చుట్టుముట్టిన వాయు కాలుష్యం రోజు రోజుకూ తీవ్ర రూపాన్ని దాలుస్తోంది. ఆదివారం నాటికి ఈ పరిస్థితి మరింత అధ్వాన్న స్థితికి చేరుకుంది. తేలికపాటి జల్లులు పడటంతో వాతావరణంలో కాలుష్యం మరింత మందగించింది. వాయు కాలుష్యం తెరలు ఢిల్లీని చుట్టేశాయి. దుప్పటిలా పరచుకున్నాయి. దీని ప్రభావం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపైనా తీవ్రంగా పడింది. వాయు కాలుష్య పొరల వల్ల రన్ వే సైతం సరిగ్గా కనిపించని పరిస్థితి నెలకొంది. ఫలితంగా పలు విమానాలు దారి మళ్లాయి.
మొత్తం 32 విమానాలను దారి మళ్లించినట్లు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం-జీఎంఆర్ అధికారులు వెల్లడించారు. వెలుతురు సరిగ్గా లేని కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. 12 విమానాలను జైపూర్, అమృత్ సర్, లక్నో మీదుగా మళ్లించినట్లు పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని ఐజీఐ-జీఎంఆర్ అధికారులు వరుస ట్వీట్ల ద్వారా వెల్లడించింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 32 విమానాలను దారి మళ్లించామని స్పష్టం చేశారు. వెలుతురు ఆశించిన స్థాయిలో లేకపోతే.. మరిన్ని విమానాలను దారి మళ్లించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
5వ తేదీ వరకు పాఠశాలలకు సెలవు..
వాయు కాలుష్యం ఢిల్లీని మాత్రమే కాదు.. పొరుగునే ఉన్న ఇతర రాష్ట్రాలను కూడా చుట్టబెట్టింది. ఢిల్లీని ఆనుకుని ఉన్న హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ జిల్లాలపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోకి వచ్చే గుర్ గావ్, ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, గౌతమ బుద్ధ నగర్ జిల్లాలు కాలుష్యం బారిన పడ్డాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ నొయిడా పరిధిలోని అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవును ప్రకటించారు. మంగళవారం వరకూ సెలవు కొనసాగుతుంది. ఢిల్లీలో ఇదివరకే పాఠశాలలకు సెలవును ప్రకటించారు. పంజాబీ బాగ్, నరేలా, పూసా, బవానా, ఆనంద్ విహార్, అశోక్ విహార్, ముండ్కా, ఐటీఓ వంటి ప్రాంతాల్లో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిని ఎప్పుడో దాటేసింది.