కర్ణాటకలో హిందూ సంస్థ యువకుడి దారుణ హత్య, కారులో వెంటాడి, కత్తులతో !
బెంగళూరు: కర్ణాటకలో హిందూ సంస్థలో చురుకుగా పని చేస్తున్న మరో యువకుడు దారుణ హత్యకు గురైనాడు. మంగళూరు నగర శివార్లలోని సూరత్కల్ లోని కాటిపాళ్య ప్రాంతంలో దీపక్ అలియాస్ దీపక్ రావ్ (28) అనే యువకుడిని కారులో వెంటాడి మారుణాయుధాలతో కిరాతకంగా నరికి దారుణంగా హత్య చేశారు.
ప్రముఖ టాటా డొకోమో కంపెనీలో దీపక్ మొబైల్ కరెన్సీ డిస్టిబ్యూటర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటిలాగే మొబైల్ కరెన్సీ విక్రయించగా వచ్చిన నగదును బుధవారం కంపెనీలో జమ చేసి బైక్ లో బయలుదేరాడు. దీపక్ కదలికలను ప్రత్యర్థులు గమనించారు.
మంగళూరు నగర శివార్లలోని కాటిపాళ్య ప్రాంతంలో దీపక్ బైక్ లో వెలుతున్న సమయంలో కారులో వెంబడించిన నలుగురు దుండగులు అతని బైక్ ను ఢీకొన్నారు. కిందపడిన దీపక్ ను వేటకొడవళ్లతో దారుణంగా నరకడంతో అతను సంఘటనా స్థలంలోనే మరణించాడు.
దీపక్ ఓ ప్రముఖ హిందూ సంస్థలో చరుకుగా పని చేస్తున్నాడని సూరత్కల్ పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దీపక్ తన తల్లి, వికలాంగుడైన సోదరుడిని కష్టపడి పోషిస్తున్నాడని పోలీసులు చెప్పారు. దీపక్ హత్యతో మంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిందూ సంఘ, సంస్థలు ఏకమై దీపక్ ను హత్య చేసిన వారిని అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.