ఖాతాలో డబ్బు లేకున్నా రూ.150 కోట్లు ఇవ్వాలని, షాకిచ్చిన బ్యాంకు సిబ్బంది
లక్నో:ఖాతాలో డబ్బు లేకున్నా రూ.150 కోట్లు డ్రా చేస్తానని గోనెసంచులతో బ్యాంకుకు ఓ వ్యక్తి నానా హంగామా చేశాడు. ఈ డబ్బును డ్రా చేసేందుకు అవసరమైన రక్షణ కల్పించాలని కూడ ఆయన పోలీసులను కూడ కోరాడు. అయితే చివరకు బ్యాంకులో హడావుడి చేసిన వ్యక్తికి మతిస్థిమితం సరిగాలేదని తెలిసి బ్యాంకు సిబ్బంది నిర్ఘాంతపోయారు.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని హపూర్కు చెందిన మంగళ్ సింగ్ అనే వ్యక్తి బ్యాంక్స్ గఢ్రోడ్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో హల్చల్ చేశాడు.తన ఖాతాలో నుంచి తనకు రూ.150కోట్లు విత్డ్రా చేసి ఇవ్వాల్సిందిగా బ్యాంకు సిబ్బందిని కోరాడు.
అయితే అతని ఖాతాలో ఎంత డబ్బుందో కనీసం బ్యాంకు సిబ్బంది చూడలేదు. కానీ, ఆ డబ్బును డ్రా చేసేందుకు అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని మంగల్ సింగ్కు బ్యాంకు అధికారులు సూచించారు.
ఈ విషయాన్ని బ్యాకు మేనేజర్కు క్యాషియర్ చెప్పాడు.అయితే మంగల్ సింగ్ ఖాతాలో కనీస నిల్వ నగదు కూడ లేదు. అంతేకాదు 2016 నుండి ఆ ఖాతా నిర్వహణలో కూడ లేదు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బ్యాంకు నుండి పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేస్తున్నానని తనకు రక్షణ కల్పించాలని మంగల్ సింగ్ అంతకుముందు రోజే పోలీసులను కోరాడు. బ్యాంకు వద్ద మంగల్ సింగ్ ను చూసిన పోలీసులు నిర్ఘాంతపోయారు.
కొన్ని రోజులుగా మంగల్ సింగ్ మానసిక పరిస్థితి సరిగా లేదని కుటుంబసభ్యులు పోలీసులకు వివరించారు. ఈ విషయాన్ని ధృవీకరించుకొన్న తర్వాత పోలీసులు ఆయనను వదిలేశారు.