పరిశ్రమలో భారీ ప్రమాదం, 44 మంది మృతి, పలువురికి గాయాలు.. నిద్రలోనే..
ఢిల్లీ అనాజ్ మందీ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 35 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం 44 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణం తెలియలేదు. రాత్రి షిప్ట్ చేసిన కొందరు కార్మికులు అక్కడే పడుకోవడంతో ప్రమాదం వారిని కబళించింది. ఆ కుటుంబాలను విషాదవదనంలో నింపింది.
ఫ్యాక్టరీ ఝాన్సీ రోడలో ఉంది. 600 చదరపు అడుగుల్లో విస్తరించి పరిశ్రమ ఉంది. కంపెనీలో చీకటి ఉండటంతో ఇంకా ఎంతమంది ఉన్నారనే అంశంపై క్లారిటీ రావడం లేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అగ్నిమాపక సిబ్బందికి తెల్లవారుజామున 5.22 గంటలకు ఫోన్ చేశారు. అయితే మంటలు ఎన్ని గంటలకు వ్యాపించాయే అనే అంశంపై క్లారిటీ లేదు. అగ్నిప్రమాదానికి కారణం కూడా తెలియలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందా ? లేదంటే మరేదైనా కారణంతో అనే అంశం తెలియాల్సి ఉంది.
క్షతగాత్రులు ఎల్ఎన్జేపీ ఆస్పత్రి, రాం మనోహర్ లోహియా ఆస్పత్రి, హిందురావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అగ్నిప్రమాదం జరిగే సమయంలో ఫ్యాక్టరీలో 25 మంది నిద్రిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. కూలీలు రాత్రి అక్కడే పడుకొన్నారని చెప్పారు. అయితే మృతుల సంఖ్య పెరగడంతో అందులో ఎంతమంది ఉన్నారనే అంశంపై స్పష్టత లేకుండా పోయింది. మంటలను పూర్తిగా ఆపివేశామని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు.