వాళ్లను నమ్ముకుంటే మునుగుతాం: సొంత ఎంపీలపై బీజేపీ అసహనం: 35 శాతం సిట్టింగులకు మొండిచెయ్యి
న్యూఢిల్లీ: సొంత పార్టీకి చెందిన లోక్సభ సభ్యుల పనితీరుపై భారతీయ జనతాపార్టీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. వారిని నమ్ముకుంటే గెలుపు సంగతి అటుంచి- సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా ఆవిర్భవించలేమని భావించింది. సిట్టింగ్ ఎంపీల్లో 35 శాతం మందికి టికెట్లను నిరాకరించింది. వారికి మొండిచెయ్యి చూపింది. టికెట్ నిరాకరణకు గురైన వారంతా తొలిసారిగా లోక్సభకు పోటీ చేసి, విజయం సాధించిన వాళ్లే కావడం ఓ ట్విస్ట్. వరుసగా రెండోసారి వారిని లోక్సభ బరిలో దింపే సాహసానికి పూనుకోలేదు కమలనాథులు. ఇంటికి సాగనంపేశారు.
2014 లోక్సభ ఎన్నికల సందర్భంగా 158 మంది కొత్త ముఖాలను ఎన్నికల రేసులో నిలిపింది బీజేపీ. అంతకుముందు ఉన్న యూపీఏ-2 ప్రభుత్వ వ్యతిరేక పవనాలు కావచ్చు లేదా నరేంద్రమోడీ ఛరిష్మా వల్ల కావచ్చు.. వారంతా గెలిచేశారు. తొలిసారిగా లోక్సభ గుమ్మం తొక్కారు. అక్కడి దాకా బాగానే ఉంది. ఆ తరువాతే అసలు కథ మొదలైంది. కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యుల్లో 55 మంది పనితీరు ఈ అయిదేళ్ల వ్యవధిలో అధ్వాన్నంగా తయారైందంటూ నివేదికలు వచ్చాయి. మరోసారి వారు గెలిచే అవకాశాలే లేవంటూ నివేదికలు స్పష్టం చేశాయి. దీనితో వారికి టికెట్ నిరాకరించింది. మిగిలిన 103 మంది సిట్టింగులకు మరో అవకాశాన్ని ఇచ్చింది. వరుసగా రెండోసారి పోటీ చేసేలా వారిని ప్రోత్సహించింది.
ఈ 55 సిట్టింగ్ ఎంపీల్లో 17 మంది ఉత్తర్ ప్రదేశ్కు చెందిన వారు ఉన్నారు. మధ్యప్రదేశ్-8, ఛత్తీస్గఢ్-5 మంది సిట్టింగులకు టికెట్ ఇవ్వలేదు బీజేపీ. ఛత్తీస్గఢ్లో టికెట్ దక్కని వారిలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ రమణ్సింగ్ కుమారుడు అభిషేక్ సింగ్ కూడా ఉన్నారు. గుజరాత్, రాజస్థాన్లల్లో నలుగురు చొప్పున సిట్టింగులకు టికెట్ కేటాయింపుల్లో చుక్కెదురైంది. అలాగే- ఢిల్లీ, మహరాష్ట్ర, బిహార్లల్లో ముగ్గురు చొప్పున, మన రాష్ట్రంలో ఇద్దరికి టికెట్ లభించలేదు.
బిహార్లో టికెట్ దక్కని ముగ్గురు సిట్టింగులు కూడా పార్టీ ఫిరయించడం విశేషం. అది కూడా బీజేపీతో పొత్తు కుదుర్చుకుని సీట్లను సర్దుబాటు చేసుకున్న జనతాదళ్ (యునైటెడ్)లో చేరారు. ఆ పార్టీ అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేశారు.
కాంగ్రెస్ కూడా ముగ్గురు కొత్త ఎంపీలకు టికెట్లను నిరాకరించింది. 2014 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నుంచి 11 మంది మాత్రమే తొలిసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు. వారిలో ముగ్గురికి మినహా మిగిలిన వారందరికీ టికెట్లను కేటాయించింది కాంగ్రెస్ అధిష్ఠానం. పొత్తులో భాగంగా కర్ణాటకలోని తుమకూరు లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ జనతాదళ్ (సెక్యులర్)కు వదులుకుంది. ఫలితంగా- అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కాంగ్రెస్ నేత ముద్దే హనుమేగౌడకు టికెట్ నిరాకరించింది. ఈ స్థానం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవేగౌడ పోటీ చేశారు. మహారాష్ట్ర, గుజరాత్లల్లో ఒకరు చొప్పున తొలిసారి ఎన్నికైన సిట్టింగులకు రెండోసారి అవకాశం ఇవ్వలేదు.