విషాదం: సముద్రంలో బోటు బోల్తా.. నలుగురు స్కూల్ విద్యార్థుల మృతి!
ముంబై: మహారాష్ట్రలో మరో ప్రమాదం సంభవించింది. 40 మంది విద్యార్థులతో ప్రయాణిస్తోన్న బోటు సముద్రంలో బోల్తా పడింది. ముంబై సమీపంలోని దహను బీచ్ వద్ద శనివారం ఉదయం 11:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఇప్పటి వరకూ 32 మంది విద్యార్థులను కాపాడగలిగారు. మిగతా చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రమాదం సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కోస్ట్గార్డ్ షిప్లు, హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నారు.
ప్రమాదానికి గురైన చిన్నారులంతా కేఎల్ పొండా హైస్కూల్ విద్యార్థులని తెలుస్తోంది. పిక్నిక్ కోసం బీచ్కు వెళ్లగా... ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకూ నలుగురు చిన్నారుల మృతదేహాలను వెలికితీసినట్లు తెలుస్తోంది.
మిగిలిన వారి కోసం తీవ్ర గాలింపు జరుగుతోంది. సముద్రతీరం నుంచి 2 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. బోటు సామర్థ్యానికి మించి విద్యార్థులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగిందని, లైఫ్ జాకెట్లు కూడా లేకపోవడంతో విద్యార్థులు మృతి చెందారని ప్రత్యక్ష సాక్షుల వల్ల తెలుస్తోంది.