జమ్ముకశ్మీర్కు 36 మంది కేంద్రమంత్రులు, ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి...
జమ్ముకశ్మీర్ విభజన, లడాఖ్, జమ్ముకశ్మీర్ కేంద్రప్రాంత పాలిత రాష్ట్రాలుగా మార్చిన తర్వాత ఆ ప్రాంతంలో కేంద్రమంత్రులు పర్యటించబోతున్నారు. ఈ నెలలో దాదాపు 36 మంది మంత్రులు జమ్ముకశ్మీర్, లడాఖ్ చుట్టొస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రప్రాంత ప్రాలిత రాష్ట్రాలుగా మార్చిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలకు నేరుగా తెలియజేసి అనుకూల వాతావరణం తీసుకరావడమే ఈ ప్రత్యేక పర్యటన ముఖ్య ఉద్దేశం.
ఆర్టికల్ 370 ఎందుకు రద్దు చేశామనే అంశాన్ని ప్రజలకు కేంద్ర మంత్రులు తెలియజేయనున్నారు. నేరుగా ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం కేంద్రమంత్రులను కశ్మీర్ పంపిస్తోంది. గతేడాది ఆగస్ట్ 5వ తేదీన కశ్మీర్ విభజన తర్వాత ఇంత భారీస్థాయిలో కేంద్రమంత్రులు వెళ్లడం ఇదే తొలిసారి.
రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, మానవ వనరులశాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతీ ఇరానీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఉపరితల రవాణశాఖ సహాయమంత్రి వీకే సింగ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ కిషన్ రెడ్డి, జితేంద్ర సింగ్, అనురాగ్ ఠాకూర్, గిరిరాజ్ సింగ్, రేణుకా సింగ్, కిరెణ్ రిజిజు తదితరులు జమ్ముకశ్మీర్, లడాఖ్లో పర్యటించి.. ప్రజలతో మమేకమవుతారు.
36 మంది మంత్రులు 59 ప్రాంతాలను ఈ నెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సందర్శిస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 51 సందర్శనలు జమ్ములో ఉండగా, 8 ప్రాంతాలను శ్రీనగర్లో షెడ్యూల్ చేశారు.