sabarimala verdict: పేర్లు నమోదు చేసుకున్న మహిళలు, ఎంతమందంటే.?
తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తాజాగా నిరాకరించడంతో పలువురు మహిళలు ఆలయాన్ని దర్శించుకునేందుకు పేర్లు నమోదు చేసుకుంటున్నారు. వచ్చే ఆదివారం(నవంబర్ 16) అయ్యప్ప ఆలయం తెరుచుకోనున్న విషయం తెలిసిందే.
పేర్లు నమోదు చేసుకున్న మహిళలు
ఈ క్రమంలో ఆలయ కమిటీ స్వామి దర్శనానికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. కాగా, ఇప్పటి వరకు స్వామివారిని దర్శించుకోవడం కోసం 36 మంది మహిళలు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడడానికి కొద్ది సమయం ముందే వీరు పేర్లు నమోదు చేసుకోవడం గమనార్హం.
ప్రవేశంపై గత ఏడాదే తీర్పు..
కాగా, 2018, సెప్టెంబర్ 28న ఆలయం లోపలికి మహిళల ప్రవేశ నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గతంలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంపై నిషేధం ఉంది.
740 మంది పేర్లు నమోదు చేసుకున్నా..
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత 2019, జనవరి 2న ఇద్దరు మహిలలు ఆలయ ప్రవేశం చేశారు. గత ఏడాది కూడా నిషేధిత వయస్సున్న 740 మంది మహిళలు ఆలయ ప్రవేశం కల్పించాలంటూ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే, నమోదు చేసుకున్న వారి వివరాలను పోలీసులు సేకరించిన తర్వాత వారి ఇళ్లకు వెళ్లి వారు శబరిమలకు రావడం లేదని తెలుసుకున్నారు.
వివరాలు సేకరించిన పోలీసులు
కాగా, ఇప్పుడు కూడా శబరిమల ఆలయానికి వచ్చేందుకు పేర్లు నమోదు చేసుకున్న మహిళల వివరాలను కూడా పోలీసులు తెలుసుకున్నట్లు సమాచారం. కాగా, సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన నిర్ణయంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించేందుకు నిరాకరించారు. అయితే, కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలు చేస్తామని చెప్పారు.