వైద్యుల నిర్లక్ష్యం: కంటిచూపు కోల్పోయిన 37మంది
రాజ్నంద్గావ్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆపరేషన్ వికటించి దాదాపు 37 మందికి కంటి చూపు కోల్పోయారు. రాజ్నంద్గావ్లోని క్రిస్టియన్ ఫెలోషిప్ ఆస్పత్రిలో మన్పూర్ బ్లాక్ చుట్టుపక్కల గ్రామాల్లోని 54 మందికి కంటి శుక్లాలు తొలగించే శస్త్ర చికిత్స చేశారు.
మరుసటి రోజు వారిని ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. అయితే రోగులు ఇంటికి వెళ్లిన తర్వాత బ్యాండేజ్ విప్పి చూడగా చాలా మందికి అసలేమీ కనిపించలేదు. 54 మందిలో దాదాపు 37 మందికి చూపు పోయింది. రోగుల ఫిర్యాదు మేరకు ఆస్పత్రి యాజమాన్యం వారికి రాయ్పూర్ ఆస్పత్రిలో మళ్లీ ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది.
ఆస్పత్రి యాజమాన్యం, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని రోగుల కుటుంబసభ్యులు వాపోయారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, ఇన్ఫెక్షన్ వల్ల అలా జరిగి ఉండొచ్చని, గతంలో తమ ఆస్పత్రిలో ఎలాంటి సమస్యలు లేకుండా ఎన్నో ఆపరేషన్లు చేశామని ఆస్పత్రి డైరెక్టర్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నివేదిక వచ్చాక తర్వాతి చర్యలు తీసుకుంటామని జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ తెలిపారు.