370 రద్దు ప్రభావం..!మోగనున్న బాజా భజంత్రీలు..!కశ్మీర్ యువతిని పెళ్లి చేసుకోబోతున్న రాజస్తాన్ యువకుడు
కశ్మీర్/హైదరాబాద్ : అక్కడ అంతా సర్దుకుంది. ఏదో జరిగిపోతుంది అని భయపడిన వాళ్లు ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకునే పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలు అదుపులో ఉండడమే కాకుండా దైనందిన జీవనంలో ఎవరి పనుల్లో వారు నిమగ్నమై పోతున్నారు. కక్ష్యలు, కార్పణ్యాలు, పగలు, ప్రతికారాలు, కోపాలు, తాపాలు. వైషమ్యాలు, విద్వేషాలు పక్కన పెట్టి సోదరభావంతో కలిసిపోయారు. ఇక చేయాల్సింది మరి కొద్ది రోజులు అప్పమత్తంగా ఏంటే సరిపోతుందనే భావన కలుగుతోంది. ఇదీ జమ్మూ కశ్మీర్ లో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు.
అంతే కాకుండా జమ్మూ కశ్మీర్ లో స్వేచ్చా వాయువులు పీలుస్తున్న యువతీ యువకులు వారి వారి మనోబావాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. మనసిచ్చిన వాడిని మనువాడేందుకు నిర్బయంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. అదే భారత ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం అనే చర్చ కూడా జరుగుతోంది. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తరువాత తొలిసారి ఓ కశ్మీరీ యువతిని వేరే రాష్ట్ర యువకుడు పెళ్లి చేసుకోబోతున్నాడు.రాజస్థాన్ కు చెందిన యువకుడు కశ్మీరీ యువతిని వివాహమాడనున్నాడు.రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ కు చెందిన అక్షయ్, కొంతకాలం ముందు న్యూఢిల్లీలో ఉద్యోగం చేశాడు.
అదే సమయంలో కశ్మీర్ కు చెందిన కామినీ రాజ్ పుత్, ఢిల్లీలోని తన అత్త నివాసంలో కొన్ని రోజులు గడిపింది. అప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే, అమ్మాయికి ఉన్న ప్రత్యేక హక్కులను కోల్పోతుందని తల్లిదండ్రులు భయపడి పెళ్లికి అడ్డు చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో అడ్డంకులు తొలగిపోయి, పరిస్థితులు కలిసి రావడంతో, వీరు పెళ్లికి సిద్ధమయ్యారని సమాచారం.
ఇక ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు సాహసోపేత నిర్ణయం వల్ల వీరు ఒకటి కానున్నారు. ఇప్పుడు తామిద్దరమూ ఎంతో సంతోషంగా ఉన్నామని, మోదీ సర్కారుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని అక్షయ్ అంటున్నాడు. వీరిద్దరికీ ఇప్పుడు నిశ్చితార్థం జరుగగా, మరో రెండు వారాల్లో వివాహాన్ని వైభవంగా నిర్వహించాలని పెద్దలు నిశ్చయించారు. మోదీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం తరువాత, ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఓ కశ్మీర్ అమ్మాయిని పెళ్లాడటం ఇదే ప్రథమం కావడం గమనార్హం.