39 మంది భారతీయులను కాల్చి చంపిన ఐసిస్
Recommended Video
న్యూఢిల్లీ: నాలుగేళ్ళ క్రితం ఇరాక్లో కిడ్నాపైన 39 మంది భారతీయ కార్మికులను ఐసిస్ తీవ్రవాదులు చంపేశారని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటించారు. మంగళవారం నాడు రాజ్యసభలో ఈ మేరకు సుష్మా స్వరాజ్ ప్రకటన చేశారు.
2014లో ఇరాక్లో కిడ్నాపైన 39 మంది భారతీయల ఆచూకీ కోసం భారత్ అనేక ప్రయత్నాలను చేసిన విషయాన్ని సుష్మాస్వరాజ్ రాజ్యసభలో గుర్తు చేశారు. కిడ్నాప్ చేసిన భారతీయులను చంపేశారని ఆమె ప్రకటించారు.
ఐసిస్ తీవ్రవాదులు భారతీయులను చంపేసి మోసుల్లోనే సామూహికంగా పూడ్చిపెట్టారని సుష్మా స్వరాజ్ చెప్పారు. భారతీయులను పూడ్చి పెట్టిన స్థలాన్ని రాడార్లు కనిపెట్టాయని ఆమె సభలో చెప్పారు. అయితే మృతదేహలను భారత్కు రప్పించేందుకు అన్ని రకాల చర్యలను తీసుకొంటున్నామని ఆమె చెప్పారు.
మృతదేహాలను పరీక్షల కోసం బాగ్దాద్ పంపగహా డీఎన్ఏ శాంపుల్స్ 70 శాతం వరకూ మ్యాచ్ అయ్యాయని సభకు తెలిపారు. ఆ అవశేషాలను తీసుకువచ్చేందుకు జనరల్ వీకే సింగ్ బాగ్దాద్ వెళ్తున్నారని చెప్పారు. ప్రత్యేక విమానంలో వాటిని తీసుకువస్తారని సభకు తెలిపారు. ఆ అవశేషాలను తొలుత అమృత్ సర్, తర్వాత పాట్నా, కోల్కతాలకు తరిలిస్తామని చెప్పారు.
ఇరాక్లో కిడ్నాప్ అయిన తమవారంతా ఎక్కడో ఒకచోట బతికే ఉంటారని 2014 నుంచి ఆశగా ఎదురుచూస్తున్న వారికి సుష్మా స్వరాజ్ ప్రకటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఇరాక్లో చనిపోయిన వారికి సంతాపంగా రాజ్యసభ ఒక్క నిమిషం పాటు మౌనం పాటించింది.
మరో వైపు ఇదే విషయమై లోక్సభలో కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటన చేస్తారని స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు. అయితే విపక్ష ఎంపీలు వెల్లోనే ఉండి గొడవ చేశారు. మానవత్వం లేదా అంటూ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాక్లో నాలుగేళ్ళ క్రితం కిడ్నాపైన 39 మంది భారతీయులు చనిపోయారని సుష్మాస్వరాజ్ ప్రకటించారు. దీనిపై ప్రకటన చేయనున్నట్టు చెప్పారు. సహకరించాలని విన్నవించారు. కానీ, సభ్యులు సహకరించలేదు. దీంతో లోక్సభను బుధవారానికి వాయిదావేశారు.