చెత్త సిటీలు: టాప్ 5లో 4మనవే, మెరుగుపడిన ఢిల్లీ 9కి
జెనీవా: భారత్లో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందనడానికి నిదర్శనంగా ఉంది తాజా చెత్త నగరాల జాబితా. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాలోని మొదటి 5 నగరాల్లో 4 భారత్లోనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నివేదికలో వెల్లడించింది.
ప్రపంచంతో పోల్చి చూసినా కాలుష్యం ఈ స్థాయిలో ఉండటం శోచనీయం. గత సంవత్సరం మన రాజధాని నగరం డిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా అపఖ్యాతి మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది కాస్త మెరుగుపడి తొమ్మిదో స్థానానికి చేరుకుంది.
ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఇరాన్లో జాబోల్ మొదటి స్థానంలోకి వచ్చింది. తర్వాతి నాలుగు స్థానాల్లో మనదేశంలోని గ్వాలియర్, అలహాబాద్, పాట్నా, రాయ్పూర్ నగరాలు ఉన్నాయి.
గాలిలోని పర్టిక్యులేట్ మ్యాటర్ కొలమానంగా తీసుకొని కాలుష్య నగరాలను ఎంపిక చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 103 దేశాల్లోని 3వేల నగరాలను పరిశీలించి ఈ జాబితా విడుదల చేసింది. నిరుడు 1600 నగరాలను మాత్రమే పరిశీలించారు.
కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధులు, రకరకాల రోగాలు వస్తున్నాయి. అధిక స్థాయిలో కాలుష్యం పెరిగితే గుండెపోటుతో సంభవించే మరణాలు కూడా చాలా వేగంగా పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాయుకాలుష్యం కారణంగా ఏడు మిలియన్ల మంది ఆయుష్షు నిండకుండానే మరణిస్తున్నారని నివేదిక వెల్లడించింది.
కాగా, భారత ప్రభుత్వం కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యల పట్ల డబ్ల్యూహెచ్ఓ పబ్లిక్ హెల్, ఎన్విరాన్ మెంటల్ అండ్ సోషల్ డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్ అధిపతి మారియా నేరా సంతృప్తి వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రణాళికలు అమలు చేయడం శుభపరిణామం అన్నారు. భారతదేశంలా మిగితా దేశాలు స్పందించడం లేదని చెప్పారు.