యమునా నదిలో బుట్టలో 4 రోజులు శిశువు, ఎండ దెబ్బకు కమిలిన చర్మం
లక్నో: యమునా నదిలో వెదురు బుట్టలో తేలుతూ వస్తోన్న నాలుగు రోజుల వయసున్న బిడ్డను స్ధానికులు రక్షించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిల్వానీ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
రాంజీలీలా అనే ఓ పశువుల కాపరి శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో వెదురుబుట్ట ఒకటి నదిలో తేలుతూ వెళ్లడం చూసి ఆశ్చర్యపోయాడు. నదిలో ఎవరో పిల్లలు ఆడుకుంటూ వదిలేసి ఉంటారని అనుకున్న అతడు, కుతూహలంతో పడవ సహాయంతో దగ్గరకు వెళ్లి చూసే సరికే నాలుగు రోజులున్న ఓ పసిబిడ్డ అందులో ఉన్నాడని తెలిపారు.
శిశివు బతికే ఉన్నాడని గుర్తించిన అతను బిడ్డను రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చాడు. ఎండ దెబ్బకు బాగా కమిలిపోయిన చిన్నారిని సమీపంలోని గ్రామానికి తీసుకువెళ్లి, పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఆ బేబిని హుటాహుటిన స్ధానిక ఆసుపత్రిలో చేర్పించారు.
ఈ విషయంపై ఫతేబాద్ ఎఎస్పీ సోమన్ బర్మన్ మాట్లాడుతూ తొలుత మేం బేబిని చూసినప్పుడు పరిస్ధితి విషమంగా ఉందన్నాడు. వెంటనే ఆంబులెన్స్లో ఎన్ఎన్ మెడికల్ కాలేజీకి తరలించామన్నారు. అక్కడ వైద్యులు బేబిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్సను అందిస్తున్నారని పేర్కొన్నారు.
నీళ్లలో తేలియాడుతున్నప్పుడు ఎండ తగలడం వల్ల బిడ్డకు చర్మం కమిలిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.