మరో 4 రోజుల్లో పెళ్లి, ఇంకా వుహాన్లోనే తెలుగు యువతి, ఆందోళనలో పేరెంట్స్..
మరో 4 రోజుల్లో యువతి పెళ్లి.. కానీ ఆమె ఇంకా వుహాన్లో చిక్కుకొని ఉన్నారు. కరోనా వైరస్ మొదట బయటపడింది ఇక్కడే. వైరస్ బారినపడ్డ రోగులు ప్రతీ రోజు పదుల సంఖ్యల చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. యువతి తల్లిదండ్రులు ఢిల్లీకి చేరుకొన్నారు. నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డిని కలిసి.. తమ కూతురిని స్వదేశం రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ సహా ఇతర కేంద్రమంత్రులను కలిసి తమ గోడు వెల్లబోసుకోనున్నారు.
టీసీఎల్లో కొలువు..
కర్నూలు జిల్లా ఈరలపాడుకు చెందిన అన్నెం జ్యోతి టీసీఎల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అయితే శిక్షణ ఇస్తోంది మాత్రం చైనాలోని వుహన్లో.. అప్పటికీ కరోనా వైరస్ బయటపడలేదు. 56 మందితో కలిసి ట్రైనింగ్కు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 4 లేదంటే 5వ తేదీన ఇండియా రావాలి. కానీ కరోనా వైరస్ వల్ల.. రెండు ఎయిర్ ఇండియా విమానాల్లో వచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
టెంపరేచర్..
ఆ సమయంలో జ్యోతికి కాస్త టెంపరేచర్ ఉండటంతో తీసుకొచ్చేందుకు అధికారులు అంగీకరించలేదు. దీంతో యువతి అక్కడే ఉన్నారు. యువతితో శిక్షణకు వెళ్లిన 55 మంది ఎయిర్ ఇండియా విమానాల్లో స్వదేశం తిరిగొచ్చారు. కానీ జ్యోతి మాత్రం అక్కడే ఉండిపోయారు. మరోవైపు ఈ నెల 14వ తేదీన జ్యోతికి వివాహాం నిశ్చయించారు.
4 రోజుల్లో పెళ్లి..
మరో నాలుగురోజుల్లో పెళ్లి ఉండగా.. జ్యోతి మాత్రం కరోనా వైరస్ రక్కసి జడలు విప్పి నాట్యం చేస్తోన్న వుహన్లోనే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. ప్రతీరోజు పేరెంట్స్తో మాట్లాడుతోన్న జ్యోతి.. ధైర్యంగానే ఉంటూ తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నారు. కానీ తనను వీలైనంత త్వరగా ఇక్కడినుంచి తీసుకొని రావాలని మాత్రం కోరుతున్నారు.
ఢిల్లీకి జ్యోతి తల్లి..
పెళ్లి సమయం దగ్గరికీ రావడం, తమ కూతురు మాత్రం వుహన్లో చిక్కుకుపోవడంపై జ్యోతి తల్లి ఢిల్లీ వచ్చారు. నంద్యాల ఎంపీ బ్రహ్మనందరెడ్డిని కలిసి సమస్యను విన్నవించారు. తన కూతురిని స్వదేశం తీసుకొచ్చేందుకు సాయం చేయాలని కోరారు. ఇండియా తీసుకురావడం ఇబ్బంది అనుకొంటే.. మరో నగరానికి తరలించాలని కోరుతున్నారు. వైరస్ బారిన పడే అవకాశం ఉండదని రోదిస్తూ చెప్పారు. విదేశాంగ మంత్రి జై శంకర్ను కలిసి సమస్యను విన్నవించబోతున్నారు. ఇతర కేంద్రమంత్రుల దృష్టికి కూడా విషయం తీసుకెళతారు.