భూకంపం: పరుగు పెట్టిన ముఖ్యమంత్రి, నేపాల్లో 26గురు మృతి
లక్నో: నేపాల్లో మంగళవారం మధ్యాహ్నం వచ్చిన భూకంపం ధాటికి ఉత్తర ప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయి. యూపీలో ప్రకంపనల ప్రభావం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు కూడా తాకింది. ప్రకంపనలు వచ్చిన సమయంలో లక్నో ఓ కార్యక్రమానికి అఖిలేష్ హాజరయ్యారు.
ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో అఖిలేష్తో పాటు కార్యక్రమానికి హాజరైన నేతలు, అధికారులు అందరూ భవనం నుండి పరుగులు తీశారు. కాగా, భూకంపం ధాటికి ఉత్తర ప్రదేశ్లోని సంబాల్ జిల్లాలో ఓ వ్యక్తి మృతి చెందారు. బీహార్లో ఇద్దరు మృతి చెందారు.
సమాచారం సేకరిస్తున్నాం: రాజ్నాథ్ సింగ్
ఉత్తరాదిన వచ్చిన భూప్రకంపనల విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ప్రకంపనల గురించి తెలిసిందని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. నేపాల్కు భారత్ అన్ని విధాలా సాయం చేస్తుందని తెలిపారు. భారత్లో ఎక్కడైనా నష్టం జరిగిందో తెలుసుకుంటున్నామని చెప్పారు.
భూకంపం ధాటికి నేపాల్లో 26గురు మృతి
నేపాల్లో భూకంపం ధాటికి... 26 మంది మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. చౌతారా ప్రాంతంలో పలు భవంతులు నేలకూలాయి. ఈ ఘటనలో వారు మృతి చెందారు. నేపాల్లో పదిహేను రోజుల క్రితమే ఏప్రిల్ 25వ తేదీన 7.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇప్పుడు 7.3 తీవ్రతతో మరోసారి భూకంపం రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా ఇళ్లలో ఉంటే బయటకు రావాలని పోలీసులు చెబుతున్నారు.