హిందూ మహాసభ అధ్యక్షుడి హత్య కేసులో నలుగురి అరెస్ట్, రంజిత్ రెండో భార్య, స్నేహితుడు విచారణ..?
హిందూ మహాసభ అధ్యక్షుడు రంజిత్ బచ్చన్ హత్యకేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోరఖ్పూర్, రాయ్బరేలిలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. లక్నోలో ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా దుండగులు బైక్పై వచ్చి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
రెండో భార్యను ఎంక్వైరీ..?
రంజిత్ బచ్చన్ హత్య తర్వాత పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. రంజిత్ రెండో భార్య స్మృతిని బుధవారం ప్రశ్నిస్తామని టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. మరోవైపు రంజిత్ బచ్చన్ సన్నిహితుడు, గోరఖ్ఫూర్ వ్యాపారిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ నలుగురు దుండగుల వెనక ఎవరు ఉన్నారు..? హత్యకు గల కారణం ఏంటో విచారణలో తేలుస్తోందని పోలీసులు చెప్తున్నారు.
బైక్పై వచ్చి..
ఆదివారం ఉదయం లక్నోలోని హజరత్గంజ్ వద్ద గల సీడీఆర్ఐ భవన సముదాయంలో ఉన్న గ్లోబల్ పార్క్ వద్ద తన సోదరుడు ఆదిత్యతో కలిసి రంజిత్ బచ్చన్ మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఇంతలో బైక్పై వచ్చిన దుండగులు రంచిత్ బచ్చన్పై కాల్పుల మోత మోగించారు. తలపై కాల్చడంతో తీవ్ర రక్తస్రావమైంది. రంజిత్ సోదరుడు ఆదిత్య కూడా కాల్పుల్లో గాయపడ్డారు. ఆ వెంటనే దుండగులు టూ వీలర్ మీద పారిపోయారు. బచ్చన్ను లక్నో ట్రామా సెంటర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ప్రయోజనం లేకపోయింది. బచ్చన్ చనిపోగా.. గాయాలతో ఆదిత్య చికిత్స పొందుతున్నారు.
ఉత్కంఠ
ఆదివారం ఉదయం కాల్పులు జరగడంతో ఆ ప్రాంతంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. వెంటనే యూపీ పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. క్రైం బ్రాంచ్ కూడా రంగంలోకి దిగింది. ఘటన జరిగిన తర్వాత నలుగురు పోలీసులపై యోగి సర్కార్ సస్పెన్షన్ వేటువేసింది. ఇందులో ఇద్దరు పీఆర్వీ పోలీసులు కాగా, ఒకరు కానిస్టేబుల్, మరొకరు ఔట్పోస్ట్ ఇంచార్జీ ఉన్నారు.
బెదిరింపులు
గత కొద్దిరోజులుగా రంజిత్ బచ్చన్కు బెదిరింపు ఫోన్స్ వచ్చాయని పోలీసులు తెలిపారు. బచ్చన్ను హతమార్చిన నిందితుల సీసీటీవీ ఫుటేజీ విడుదల చేసిన పోలీసులు.. నిందితులకు సంబంధించిన సమాచారం అందజేస్తే రూ.50 వేల రివార్డు అందజేస్తామని పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్లో హిందూ సమాజ్ నేత, మాజీ హిందూ మహాసభ నేత కమలేశ్ తివారీని కూడా దుండగులు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.