పుల్వామా ఉగ్రదాడి తరువాత కుండ లస్సీతో పండగ చేసుకున్న విద్యార్థినులు
జైపూర్ః జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద జైషె మహమ్మద్ ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసి, మారణహోమాన్ని సృష్టించిన ఘటనను టీవీల్లో చూసిన నలుగురు విద్యార్థినులు పండగ చేసుకున్నారు. స్థానికంగా ఓ రెస్టారెంట్కు వెళ్లి ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను వాట్సప్లో పోస్ట్ చేశారు.
చేతుల్లో కుండలస్సీని పట్టుకుని ఉన్న ఫొటోను వారు షేర్ చేశారు. దానికి పుల్వామా దాడికి తాము ఇచ్చే బదులు..అంటూ ట్యాగ్ చేశారు. ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. అవి యూనివర్శిటీ అధికారుల దృష్టికి చేరింది. దీనితో అధికారులు వారిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్లో చోటు చేసుకుంది.
జమ్మూకాశ్మీర్కు చెందిన విద్యార్థినులు తల్వీన్ మన్జూర్, ఇక్రా, జోహ్రా నజీర్, ఉజ్మా నజీర్ జైపూర్లోని నిమ్స్ యూనివర్శిటీ రాజస్థాన్లో చదువుకుంటున్నారు. ఈ నలుగురిలో ఇక్రా బీఫార్మశీ విద్యార్థిని. మిగిలిన ముగ్గురూ బీఎస్సీ విద్యార్థినులు. పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాత పడిన అనంతరం వారు నలుగురూ చాలా ఆనందంగా కనిపించారని తోటి విద్యార్థులు చెబుతున్నారు.
అదేరోజు సాయంత్రం వారు జైపూర్లోని ఓ రెస్టారెంట్కు వెళ్లి ఎంజాయ్ చేశారు. అక్కడే చాలా సమయం పాటు గడిపారు. ఈ సందర్భంగా కుండ లస్సీని తాగుతూ, దాన్ని ఫొటో తీశారు. ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడికి తాము ఈ విధంగా బదులు ఇస్తున్నామని ఆ ఫొటోకు క్యాప్షన్ జోడించారు. పుల్వామా అటాక్కు హ్యాష్ట్యాగ్ చేశారు.
వాటిని ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్లల్లో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలు నిమ్స్ యూనివర్శిటీ రాజస్థాన్ అధికారులకు చేరాయి. దీనితో వెంటనే వారు ఆ నలుగురినీ సస్పెండ్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు తమ యూనివర్శిటీలో తావు లేదని పేర్కొన్నారు. అలాంటి కార్యక్రమాలను తమ యూనివర్శిటీ ప్రోత్సహించదని చెప్పారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని, ఆ నలుగురు విద్యార్థినులు వెంటనే యూనివర్శిటీని, హాస్టల్ గదులను ఖాళీ చేయాలని ఆదేశించారు.
ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తోటి విద్యార్థులు సహా, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులపై దాడి చేయడానికి ప్రయత్నించారు. తక్షణమే స్పందించిన యూనివర్శిటీ అధికారులు వారిని ఛంద్వాజీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు.