కృష్ణాష్టమి పండుగ వేళ విషాదం: గోడకూలి నలుగురి దుర్మరణం: ఆలయంలో తొక్కిసలాట!
కోల్ కత: కృష్ణాష్టమి పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. ఓ ఆలయానికి సంబంధించిన ప్రహరీ గోడ కూలిన ఘటనలో నలుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. 27 మందికి పైగా గాయపడ్డారు. గోడ కూలిన వెంటనే భక్తులు పరుగులు పెట్టాల్సి రావడంతో.. ఆలయంలో తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో మరికొంతమంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారిని అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో పశ్చిమ బెంగాల్ 24 ఉత్తర పరగణ జిల్లాలోని కఛువాలో చోటు చేసుకుంది.
కృష్ణాష్టమి పండుగ కోసం కఛువాలోని ఉన్న లోకనాథేశ్వర స్వామి వారి ఆలయంలో పెద్ద ఎత్తున వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొనడానికి స్థానికులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావానికి ఆలయ ప్రహరీ గోడ పూర్తిగా నానిపోయి కనిపించింది.
అదే సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకోవడం, పలువురు దాని పైకి ఎక్కి కూర్చోవడంతో ఒక్కసారిగా అది కుప్పకూలిపోయింది. ఈ ఘటనలు నలుగురు భక్తులు సంఘటనాస్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. కుప్పకూలిన గోడ రాళ్ల మధ్య వారి మృతదేహాలు చిక్కుకునిపోయి కనిపించాయి. గోడ కూలడంతో పలువురు గాయపడ్డారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఆలయంలో ఉన్న భక్తులు బయటికి పరుగు పెట్టడానికి ప్రయత్నించడంతో.. స్వల్పంగా తొక్కిసలాట చోటు చేసకుంది. ఈ ఘటనలో కూడా మరికొంతమంది గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు కఛువా డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు తన సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలు, గాయపడ్డ వారికి 50 వేల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు.