20 ఏళ్ల యువతిపై 4గురు గ్యాంగ్ రేప్: నిందితులను వీధుల్లో ఊరేగించారు
భోపాల్: ఇరవై ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. బాధితురాలు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
నలుగురు నిందితులను పోలీసులు రద్దీగా ఉండే వీధుల వెంట ఊరేగించారు. సంఘటన శనివారం జరిగింది. ఆదివారం ఉదయం మహారాణా ప్రతాప్ నగర్ పోలీసు స్టేషన్లో యువతి ఫిర్యాదు చేసింది. నలుగురిని కూడా గంటలో అరెస్టు చేసినట్లు డిప్యూటీ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ ధర్మేంద్ర చౌధురి చెప్పారు.
వారిని వీధుల్లో ఊరేగిస్తూ...
ఆ నలుగురిని పోలీసులు వీధుల్లో ఉరేగిస్తున్న సమయంలో కొంత మంది మహిళలను వారిని కొట్టడం కూడా కనిపంచింది. మహిళలపై నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈవ్ టీజర్లను, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినవారిని మధ్యప్రదేశ్ పోలీసులు వీధుల్లో ఊరేగిస్తున్నారు.
ఇరువురికి మధ్య గొడవ జరిగింది
శైలేంద్ర దండి (21) అనే యువకుడు బాధితురాలికి కాలేజీలో సీనియర్. శనివారంనాడు అతను ఆమెను రెస్టారెంట్కు పిలిచినట్లు డిఐజి చెప్పారు. ఆమె అతన్ని కలిసిన తర్వాత ఏదో విషయంపై ఇరువురికి మధ్య గొడవ జరిగింది.
మిత్రుడి గదికి తీసుకుని వెళ్లి...
ఆ తర్వాత శైలేంద్ర ఆమె సెల్ ఫోన్ లాక్కుని అప్సర సినిమాకు సమీపంలోని తన మిత్రుడు సోను దంగి గదికి తీసుకుని వెల్లాడు. గదిలో సోను దంగి (21) ధీరజ్ రాజ్పూత్ (26), చిమన్ రాజ్పూ్త (25) ఉన్నారని బాధితురాలు తన ఫిర్యాదులో చెప్పారు.
చంపేస్తామని బెదిరించి అత్యాచారం
తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించి తనపై శైలేంద్ర, ధీరజ్ అత్యాచారం చేశారని, వారికి సోను, చిమన్ సాయం చేశారని ఆమె పోలీసులకు చెప్పింది. వారందరిపై సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేసినట్లు అదనపు పోలీసు సూపరింటిండెంట్ వికాస్ కుమార్ సహ్వాల్ తెలిపారు.
వారు నేరాన్ని అంగీకరించారు...
నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు డిఐజి చౌధురి చెప్పారు. నిందితులను వీధుల్లో ఎందుకు ఊరేగిస్తున్నారని అడిగితే మహిళల్లో విశ్వాసం పెచడానికేనని, అలా చేస్తున్నప్పటి నుంచి ఫిర్యాదు చేయడానికి మహిళలు ముందుకు వస్తున్నారని భోపాల్ ఇన్స్పెక్టర్ జనరల్ జైదీప్ కుమార్ చెప్పారు. అంతేకాకుండా నేరం చేయడానికి దానివల్ల భయపడుతారని అన్నారు.