మరో ట్విస్ట్, కాంగ్రెస్కు షాక్: నలుగురు ఎమ్మెల్యేలు మిస్, బీజేపీ రూ.70 కోట్లు ఆఫర్ చేసిందని సిద్ధూ
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన కీలక సీఎల్పీ సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. 80 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాను 76 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో ఆ నలుగురికి నోటీసులు జారీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలను ఈగల్టన్ రిసార్టుకు తరలించింది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడారు. గైర్హాజరైన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యేకు రూ.70 కోట్లవరకు ఆఫర్ ఇస్తున్నారన్నారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారన్నారు.
కాపలాదారు నరేంద్ర మోడీకి రూ.70 కోట్లు ఆఫర్ చేసేంత భారీ మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని సిద్ధరామయ్య ప్రశ్నించారు. మరోవైపు, తమతో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని బీజేపీ చెబుతోంది. ఇంకోవైపు, తమకు 114 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ముఖ్యమంత్రి కుమారస్వామి చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, మంగళవారం మధ్యాహ్నానికి మరో ఆరుగురు బీజేపీలో చేరనున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈశ్వరప్ప ఢిల్లీలో సోమవారం చేసిన ప్రకటనతో కలకలం ప్రారంభమైంది.