భారత్లో మరో నాలుగు కొత్త వైరస్ కేసులు- 29కి చేరిన బాధితులు
భారత్లో బ్రిటన్ నుంచి ప్రవేశించిన కొత్త వైరస్ కలకలం కొనసాగుతోంది. గత నెల రోజుల వ్యవధిలో బ్రిటన్ నుంచి భారత్కు వచ్చిన ప్రయాణికుల శాంపిల్స్ను ఇప్పటికే పలు ల్యాబ్లకు పంపారు. వీటి నుంచి వెలువడుతున్న ఫలితాల్లో మరో నాలుగు పాజిటివ్గా తేలాయి. దీంతో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య 29కి చేరుకుంది.
ఇవాళ పాజిటివ్గా తేలిన నాలుగు శాంపిల్స్లో మూడు బెంగళూరు ల్యాబ్లోనూ, మరొకటి హైదరాబాద్ సీసీఎంబీ ల్యాబ్లోనూ తేలాయి. ఇప్పటివరకూ నమోదైన మొత్తం 29 కేసుల్లో ఢిల్లీ, బెంగళూరు ల్యాబ్ల్లో పదేసి తేలాయి. పశ్చిమబెంగాల్లో మూడు, హైదరాబాద్లో మూడు, పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో మరో ఐదు కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. ఈ 29 మంది రోగులను ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇప్పటివరకూ బయటపడిన కరోనా వైరస్ రకాల్లో ఇదే అత్యంత ప్రభావవంతమైనదిగా నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇది బ్రిటన్, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్ జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్లో ప్రభావం చూపుతోంది. ఇతర దేశాల్లో ఇది సెప్టెంబర్లోనే బయటపడగా.. భారత్లో మాత్రం బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారా గత నెలలో బయటపడింది. బ్రిటన్ నుంచి ఇది మరింత సోకకుండా కేంద్రం ఇప్పటికే అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిషేధించింది.