ప్రాణాలు తీసిన ప్యాకేజీ టూర్: రైల్లో ప్రమాణిస్తున్నా వదలని ఎండదెబ్బ: నలుగురి మృతి
ఝాన్సీ: కేరళ ఎక్స్ప్రెస్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రైల్లో ప్రయాణిస్తున్న నలుగురు వయోధిక వృద్ధులు ఎండ తీవ్రతను తట్టుకోలేక మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆయనను ఝాన్సీ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రయాణంలో ఉండగానే వారంతా వడదెబ్బకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మృతులను బండూర్ పళణిస్వామి, బాలకృష్ణ రామస్వామి, చిన్నారి, ధివా నైగా గుర్తించారు. సుబ్బరయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
హోమ్ మంత్రికి పోలీసుల గౌరవ వందనం: సుచరితతో డీజీపీ భేటీ!
సుమారు 60 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉన్న వృద్ధులు కొందరు ఓ బృందంగా ఏర్పడి ఉత్తర్ ప్రదేశ్లోని పుణ్యక్షేత్రాలను తిలకించడానికి వెళ్లారు. ఈ బృందంలో సుమారు 70 మంది వరకు ఉన్నారు. వారంతా వారణాశి, ఆగ్రా, మధుర, ప్రయాగ్రాజ్లను సందర్శించారు. అనంతరం తమ స్వస్థలాలకు తిరుగుముఖం పట్టారు. న్యూఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్-తిరువనంతపురం మధ్య రాకపోకలు సాగించే కేరళ ఎక్స్ప్రెస్లోని ఎస్-8, ఎస్-9 బోగీల్లో వారు ప్రయాణించసాగారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చేరుకోవాల్సి ఉంది.
మార్గమధ్యలో మధ్యప్రదేశ్లోని ఝాన్సీ నగరానికి చేరుకునే సరికి ఆ బృందంలో ఏడుమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎండ తీవ్రతను తట్టుకోలేకపోయారు. వడదెబ్బకు గురయ్యారు. రైల్లోనే చూస్తుండగానే ప్రాణాలు వదిలారు. మొత్తం నలుగురు మరణించారు. మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వెంటనే ఝాన్సీ స్టేషన్లో రైలును ఆపేశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన మరో ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరికి ప్రాథమిక చికిత్స అందించడంతో వారు కోలుకున్నారు.