మర్కాజ్ హార్రర్: మత ప్రార్థనల్లో పాల్గొన్న 24మందికి కరోనా పాజిటివ్: వందేళ్ల చరిత్ర ఉన్న మసీదు సీజ్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కాజ్ మసీదు భవనంలో నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో 24 మందికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ వైద్య, ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. వారంతా ఢిల్లీ వాసులేనని తాము ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. ఢిల్లీ పోలీసులు మసీదును సీజ్ చేశారని తెలిపారు. ఈ ప్రార్థనంలో సుమారు 1500 నుంచి 1700 మంది వరకు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు.
మత ప్రార్థనలను నిర్వహించడానికి వారు అనుమతి తీసుకోలేదని తేలినట్లు సత్యేంద్ర జైన్ చెప్పారు. ఇప్పటిదాకా తాము 800 మందిని క్వారంటైన్కు తరలించినట్లు ఆయన స్పష్టం చేశారు. వారికి రక్త పరీక్షలను నిర్వహించామని, రిపోర్టులు ఇంకా అందాల్సి ఉందని అన్నారు. ప్రస్తతం వారంతా వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్లలో ఉంటున్నారని చెప్పారు. అనుమతులు కూడా లేకుండా వందలాది మంది ఒకేచోట గుమికూడటాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామని సత్యేంద్ర జైన్ స్పష్టం చేశారు.
ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, సత్యేంద్రజైన్ హాజరయ్యారు. మర్కాజ్ మసీదు భవన సముదాయంలో చోటు చేసుకున్న ప్రార్థనలు, దాని తరువాత చోటు చేసుకున్న పరిణామాలపై కేజ్రీవాల్ ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్కు లేఖ రాయాలని నిర్ణయించారు.
Recommended Video
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న మర్కాజ్ భవనంలో ప్రార్థనలను నిర్వహించడాన్ని ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఆరు అంతస్తుల్లో కొనసాగుతోన్న ఈ మసీదులో వందలాది మంది ఒకేచోట గుమికూడటాన్ని, మూడు రోజుల పాటు సామూహిక ప్రార్థనలను నిర్వహిస్తున్నప్పటికీ.. స్థానిక యంత్రాంగం పట్టించుకోకవడం పట్ల కేజ్రీవాల్ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. ప్రార్థనలను ముగించుకుని వారంతా ఎవరి స్వస్థలానికి వారు వెళ్లడం.. ఆ తరువాతే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరగిందనే అభిప్రాయాలు ఢిల్లీ ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమౌతున్నాయి.