కాశ్మీరులో ఉగ్రదాడి: నలుగురు పోలీసుల దుర్మరణం
శ్రీనగర్: కాశ్మీరులో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఐఈడి పేలుడులో నలుగురు పోలీసులు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన జమ్మూ కాశ్మీర్లో బారాముల్లా జిల్లా సోపోర్లో శనివారంనాడు చోటు చేసుకుంది.
సోపోర్ ప్రధాన మార్కెట్లో పోలీసు గస్తీ దళాన్ని లక్ష్యం చేసుకుని దుండగులు దాడి చేశారరు. ఈ భారీ పేలుడులో మూడు దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి. ఛోటా బజారు, బడా బజార్ మధ్య ఓ దుకాణం వద్ద దుండగులు ఐఈడి బాంబు పెట్టారు.
పోలీసు వాహనం దానిపై నుంచి వెళ్లడంతో పేలుడు సంభవించింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులు దిగ్బంధం చేసి గాలింపు చర్యలు చేపట్టరు. మార్కెట్లోని దుకాణాలను మూసేశారు. వేర్పాటువాదులు సమ్మెకు పిలుపునిచ్చారు. దాంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంది.
1993లో భద్రతా బలగాల దాడిలో 57 మంది మరణించారు. దానికి నిరసనగా వేర్పాటు వేదులు సమ్మెకు పిలుపునిచ్చారు.
పేలుడులో నలుగురు పోలీసులు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ట్విట్టర్లో స్పందించారు. సంఘటన తనకు ఎంతో బాధ కలిగించిందని అంటూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.