4 రాష్ట్రాలకు సీజేలుగా కొలీజియం సిఫారసు : తెలంగాణకు చౌహన్ పేరు ప్రతిపాదన
న్యూఢిల్లీ : చాలరోజుల నుంచి ఎదురుచూస్తున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ల నియామకం మరో అడుగు దూరంలో నిలిచింది. 4 రాష్ట్రాల హైకోర్టులకు సీజేల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వీరిని కేంద్రం పరిశీలించి .. ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపిస్తే నియామక ప్రక్రియ పూర్తవుతుంది.
వీరే సీజేలు ..
తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ను తెలంగాణ హైకోర్టు సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించింది. జస్టిస్ చౌహాన్ మార్చి 28న తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పడు పూర్తిస్థాయిలో సీజేగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. తెలంగాణ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్న జస్టిస్ వి.రామ సుబ్రమణియన్ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా .. ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్ డీఎన్ పటేల్, మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా జస్టిస్ ఏఏ ఖురేషీని సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. సీజేలపై అభ్యంతరం ఉంటే తిరస్కరిస్తోంది. ఆమోదం తెలిపితే .. రాష్ట్రపతికి జాబితా పంపిస్తోంది. అనంతరం వారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా నియమిస్తారు.
ఇదీ నేపథ్యం
రాజస్థాన్కు చెందిన జస్టిస్ చౌహాన్ గత ఏడాది నవంబర్ 21న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 1959 డిసెంబర్ 24న చౌహాన్ జన్మించారు. 1980లో అమెరికాలోని ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 2005లో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2015లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గత ఏడాది ఉమ్మడి హైకోర్టుకు ట్రాన్స్ ఫర్ అయి వచ్చారు. హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.
హైకోర్టు కోసం పోరాటం
రాష్ట్ర విభజన తర్వాత హైకోర్టు విభజన కోసం టీఆర్ఎస్ పార్టీ కేంద్రం పోరాటమే చేసింది. ఎంపీలు, సీఎం విన్నపాలతో కేంద్రం ఏపీ, తెలంగాణకు హైకోర్టులు ఏర్పాటుచేసింది. తాత్కాలికంగా ప్రధాన న్యాయమూర్తులకు బాధ్యతలు అప్పగించారు. అప్పటినుంచి తాత్కాలిక సీజేగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఇప్పుడు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులతో హైకోర్టులకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించనున్నారు.