అయ్యో పాపం: పాల కోసం వెళ్లిన తండ్రి తిరిగొచ్చేసరికి కన్ను మూసిన నాలుగేళ్ల చిన్నారి..!
రైల్వే స్టేషన్లలో వలసకార్మికుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. పొట్టచేత పట్టుకుని పట్టణాలకు వచ్చిన వలస కూలీలు.. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేకపోవడంతో పస్తులు ఉండలేక సొంత ఊళ్లకు వెళ్లాలని భావించారు. చాలామంది కాలినడకనే ఉన్న ఊరి నుంచి సొంత ఊరికి బయలు దేరుతుండగా మరికొందరు ఈ మధ్యే ప్రభుత్వం నడుపుతున్న ప్రత్యేక రైళ్ల ద్వారా ఊర్లు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాలినడకన వెళ్లిన వారిలో కొందరు గుండె ఆగి మృతి చెందడం జరిగింది. అసలే ఎర్రగా మండుతున్న ఎండలో చెప్పులు లేకుండా కాలినడకన వెళుతున్న వారిని చూస్తే కన్నీళ్లు ఆగవు. ఇక రైల్వే స్టేషన్లలో వారు పడుతున్న పాట్లు చూస్తే గుండె తరుక్కుపోతుంది.
తొలిరైలు తెలంగాణా నుండే ..సంతోషంగా సొంత ఊర్లకు ..మొదలైన వలసకార్మికుల తరలింపు
రైల్వే స్టేషన్లో వలస కూలీల వెతలు
బుధవారం బీహార్లోని తల్లి చనిపోయిందన్న విషయం కూడా తెలియని మూడేళ్ల చిన్నారి అమ్మను నిద్రలేపుతున్న దృశ్యం దేశాన్ని కదిలించింది. గుజరాత్ నుంచి బీహార్కు వెళుతున్న ఆ తల్లి ఆహారం లేక నీరసించిపోయి కుప్పకూలింది. కొన్ని క్షణాలకే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ముజఫర్పూర్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. తాజాగా ఇదే రైల్వే స్టేషన్లో ఓ నాలుగున్నరేళ్ల చిన్నారి మృతి చెందాడు.
రైల్లో అస్వస్థతకు గురైన నాలుగేళ్ల చిన్నారి
ఢిల్లీలో పెయింటర్గా పనిచేస్తున్న మక్సూద్ ఆలం అలియాస్ మొహ్మద్ పింటూ లాక్డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో తన సొంత రాష్ట్రం బీహార్కు వెళ్లాలని భావించి భార్య జేబా, కుమారుడు ఇషాక్లతో కలిసి శ్రామిక్ రైలు ఎక్కాడు. బీహార్లోని వెస్ట్ చంపారన్ జిల్లాకు చెందిన వాడు పింటూ. అసలే ఎండాకాలం సూర్యడు నిప్పులు కక్కుతున్నాడు. ఈ దెబ్బకు కొడుకు ఇషాక్ అస్వస్థతకు గురయ్యాడు. అయినా రైలులో ప్రయాణం చేశాడు. రైలు ముజఫర్నగర్ రైల్వేస్టేషన్కు చేరే సరికి కొడుకు ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని చెప్పాడు పింటూ. తన కొడుకు కోసం పాల ఇద్దామని పాలకోసం స్టేషన్లో వెతకినట్లు చెప్పాడు. అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పిన పింటూ.. అధికారులు స్పందించేసరికి తన కొడుకు జీవితంతో పోరాడి కన్నుమూశాడని కన్నీటి పర్యంతమయ్యాడు.
తామొకటి తలిస్తే దైవం మరొకటి తలచింది
రంజాన్ నాటికి తాము సొంతూరుకు చేరుకుని సంబరంగా ఉందామనుకున్నామని కానీ.. తాము ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు ఆ తండ్రి. ఇక కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు.ఇదిలా ఉంటే రైలు ముజఫర్పూర్ రైల్వేస్టేషన్కు చేరుకునే సరికి బాలుడు మృతి చెంది ఉంటాడని రైల్వే డిప్యూటీ సూపరింటెండెంట్ రమాకాంత్ ఉపాధ్యాయ్ చెప్పారు. ఇక ఆ కుటుంబం తమ సొంత ఊరికి చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రమాకాంత్ చెప్పారు.