హత్రాస్లో మరో దారుణం... నాలుగేళ్ల బాలికపై అత్యాచారం...
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ ఘటనను మరవకముందే... తాజాగా అదే జిల్లాలో మరో అత్యాచార ఘటన వెలుగుచూసింది. సాస్ని గ్రామంలో నాలుగేళ్ల ఓ చిన్నారిపై ఆమె బంధువు ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళవారం(అక్టోబర్ 13) జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీస్ అధికారి రుచి గుప్తా తెలిపారు.
ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని సమీపంలోని ఆమె బంధువు ఒకరు తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి కుటుంబం చెబుతోంది. సాయంత్రం పని ముగించుకుని ఇంటికొచ్చాక చిన్నారిని చూడగానే అనుమానం వచ్చిందని... ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అత్యాచార విషయం బయటపడిందని తెలిపారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
కాగా,అదే హత్రాస్ జిల్లాలో సెప్టెంబర్ 14న స్థానిక దళిత(వాల్మీకి) యువతిపై నలుగురు ఉన్నత కులాలకు చెందిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారం జరపడమే కాకుండా ఆమె నాలుక కూడా కోసేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి.
Recommended Video
ఆఖరికి మెరుగైన వైద్యం కూడా ఆలస్యంగా అందడంతో.. ఘటన జరిగిన రెండు వారాలకు బాధితురాలు కన్నుమూసింది. అదే రోజు రాత్రి అధికారులు హడావుడిగా కనీసం బాధితురాలి తల్లిదండ్రులను కూడా అనుమతించకుండా దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం దీనిపై సీబీఐ విచారణ జరుగుతోంది. అటు అలహాబాద్ హైకోర్టు దీనిపై సుమోటో కేసు నమోదు చేయగా.. సుప్రీం కోర్టులోనూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.