మోడీ నాలుగేళ్ల పాలన: విమానంలో ప్రయాణించిన సామాన్యుడు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ప్రభుత్వం ఏ రంగంలో ఏ మేర విజయాలను సాధించారనే అంశం గూర్చి చర్చ జరుగుతోంది. విమానయాన రంగం గురించి చర్చించుకున్నట్లయితే మోడీ నాలుగేళ్ల పాలనలో ఈ రంగం వేగంగా అభివృద్ధి సాధించడం గమనార్హం.
విమానాశ్రయాలను ఆధునీకరించడం, చిన్న నగరాలకు కూడా విమాన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం, సామాన్య ప్రజలకు కూడా విమాన ప్రయాణాన్ని అందించడం లాంటివి ఈ నాలుగేళ్లలో చోటు చేసుకున్నాయి.
మోడీ నాలుగేళ్ల పాలనలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్గా భారతదేశం అవతరించింది. 18-20శాతం ఎయిర్ ట్రాఫిక్ కూడా పెరిగింది. దేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు విమానాయానంపై మొగ్గుచూపారు. ఏసీ రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య కంటే విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఉడాన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు:
పౌర విమానమాన శాఖ.. రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ లేదా ఉడాన్ పథకాన్ని అక్టోబర్ 21, 2016లో ప్రారంభించింది. ఈ పథకం లక్ష్యంగా అందుబాటు ధరల్లో చిన్న నగరాలు, పట్టణాలకు కూడా విమాన సౌకర్యాన్ని అందించడం. అందుబాటులోనే ధరలు ఉండటంతో సామాన్యులు కూడా విమానాల్లో ప్రయాణించే అవకాశం లభించింది. కాగా, ఈ పథకం పూర్తిస్థాయిలో విజయవంతమైందని విమానయాన శాఖ తెలిపింది. దేశంలో కార్యకలాపాలు కొనసాగించే విమానాశ్రయాల సంఖ్య 100కు చేరుకోవడం గమనార్హం.
డొమెస్టిక్ ఎయిర్ పోర్టులను ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులుగా తీర్చిదిద్దడం:
భోపాల్, ఇండోర్, రాయ్పూర్ దేశీయ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దడం జరిగింది. ట్రాఫిక్, ఎయిర్లైన్స్ డిమాండ్, రన్వే 9వేల ఫీట్లు ఉండటం, పెద్ద విమానాలు దిగేందుకు వీలుగా ఉండటం, సరైన లైటింగ్, ల్యాండింగ్ సిస్టమ్, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్, హెల్త్, ఎనిమల్, ప్లాంట్ క్యూరెంటైన్ సర్వీసెస్ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని దేశీయ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మార్చడం జరుగుతోంది.
గ్రీన్ ఎనర్జీ విమానాశ్రయాలుగా ఢిల్లీ, కొచ్చి, హైదరాబాద్
దేశంలోని పెద్ద విమానాశ్రయాలైన ఢిల్లీ, కొచ్చి, హైదరాబాద్ లాంటి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో గ్రీన్ ఎనర్జీ తీసుకురావడం జరిగింది. 2మెగావాట్ల సోలార్ పవర్తో నడుస్తున్న దేశంలోని తొలి విమానాశ్రయంగా ఢిల్లీ ఎయిర్పోర్టు ఉంది. కొచ్చి కూడా 100శాతం సోలార్ ప్యానెల్స్తో నడుస్తోంది. ఢిల్లీలో రన్ వేకు ఇరువైపులా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ విమానాశ్రయానికి కూడా సమీపంలోనే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. రానున్న కాలంలో విమానాశ్రయంపైనే ఈ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
నూతన పౌర విమానయాన విధానం ప్రకటన
ఎయిర్ కనెక్టివిటీని పెంచేందుకు భారత ప్రభుత్వం నూతన పౌర విమానయాన విధానం ప్రకటించింది. ఈ విధానం దేశీయ విమానాలను కూడా విదేశాలకు వెళ్లేందుకు కూడా వీలు కల్పించింది. యూరోపియన్, సౌత్ ఏసియా అసోసియేషన్ ఫర్ రీజినల్ కో-ఆపరేషన్(సార్క్) దేశాల మధ్య విమానాలు కార్యకలాపాలు సాగించేందుకు వీలు కల్పించింది.