ఉగ్రవాదుల మహా కుట్ర: మానవ బాంబుల ఫ్యాక్టరీగా బాలాకోట్: ఏ క్షణమైనా సరిహద్దులు దాటడానికి సిద్ధంగా
న్యూఢిల్లీ: పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ లో మన దేశ వైమానిక దళం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ ధాటికి ధ్వంసమైపోయాయనుకున్న ఉగ్రవాద గుడారాలు మళ్లీ లేచాయి. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఉగ్రవాదులు బాలాకోట్ శిబిరాల్లో శిక్షణ పొందుతున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు నిర్ధారించారు. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తోన్న జైషె మహమ్మద్ కు లష్కరే తొయిబా సైతం తోడైందని వెల్లడించారు. ఈ రెండు ఉగ్రవాద సంస్థలు బాలాకోట్ శిబిరాల్లో మానవ బాంబులను తయారు చేస్తున్నాయని హెచ్చరించారు.
భారత సిక్కులకు పాకిస్తాన్ విసాలు.. 10 వేల మందికి: అక్కడే భోజనం.. నిద్ర
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత.. ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో భాగంగా ఉగ్రవాదులు ఈ మహా కుట్రకు తెర తీశాయని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో ఆత్మాహూతి దాడులకు పాల్పడి, పెద్ద ఎత్తున మారణ హోమాన్ని సృష్టించడం ద్వారా అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠను దెబ్బ తీయాలనేది ఉగ్రవాద సంస్థల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. బాలాకోట్ సహా మరిన్ని ప్రాంతాలకు ఉగ్రవాద శిబిరాలను విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నారని, సరిహద్దు పొడవునా బాలాకోట్ తరహా శిక్షణా శిబిరాలను నెలకొల్ప వచ్చని అంచనా వేస్తున్నారు.
ఇందులో భాగంగా- జమ్మూ కాశ్మీర్ మొదలుకుని గుజరాత్ లోని సర్ క్రీక్ వరకు గల భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో 500 మందికి పైగా ఉగ్రవాదులు మాటు వేశారని పేర్కొన్నారు. ఏ క్షణంలోనైనా వారు సరిహద్దులను దాటుకుని భారత భూభాగంపైకి ప్రవేశించడానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని, ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదురయ్యే అవకాశాలను కొట్టి పారేయలేమని చెబుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్, పష్తూమ్ లల్లోనూ దాడులకు తెగబడటానికి ఉగ్రవాదులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.