కాంగ్రెస్ను టార్గెట్ చేసిన మోడీ: 40 మంది ఎంపీల కుట్ర
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఘాటైన విమర్శలు చేశారు. దేశాభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. 400 మంది ఎంపీలు దేశాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే దీనికి వ్యతిరేకంగా 40 మంది ఎంపీలు కుట్ర చేస్తున్నారంటూ పార్లమెంట్ వర్షాకాల అనిశ్చితిపై కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు.
శుక్రవారం ఛండీగఢ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ లోక్సభలో తమ గొంతు నొక్కితే 'జనసభ'కు వెళ్తామని, ఇది పార్లమెంట్ దిగువ సభ కంటే పెద్దదని పేర్కొన్నారు.
పార్లమెంట్లో కొన్ని పార్టీలు వ్యవహరించిన తీరు చూసిన ప్రజలు వారిని క్షమించరన్నారు. ప్రజాస్వామ్యంపై ప్రతి ఒక్కరికీ అవగాహాన కల్పించాల్సిన సమయం వచ్చిందన్నారు. కానీ, కొందరు అహంకారంతో ప్రజాస్వామ్య విలువలను తుంగలోతొక్కుతున్నారని మండిపడ్డారు.
ఇలా జరగడం ప్రజాస్వామ్యానికే ఎంతో దురదృష్టకర పరిణామమని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన విధంగా మాజీ సైనికులకు వన్ ర్యాంకు వన్ పెన్షన్ అమలు చేసిన ఘనత తమదేనని చెప్పారు. దీనికి గత ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయిస్తే, తమ ప్రభుత్వం రూ.10,000 కోట్లు ఇచ్చిందని తెలిపారు. డిజిటల్ ఇండియా సాకారానికి అందరూ కలిసి రావాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు.