ఘోరం: 40మందికి ఒకే సిరంజీ.. అందరికీ హెచ్ఐవీ సోకింది
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో 40మంది సామాన్య రోగులకు హెచ్ఐవీ సోకింది. హెచ్ఐవీ ఉన్న వ్యక్తికి ఇచ్చిన సిరంజీనే మరో 40మందికి ఉపయోగించడంతో వారందరూ హెచ్ఐవీ బారినపడ్డారు. ఈ ఘటన ఉన్నావో జిల్లా పరిధిలోని బంగర్ మావ్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
హెచ్ఐవీ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ఈ ప్రాంతంలో ఓ హెల్త్ క్యాంప్ నిర్వహించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే సదరు క్లినిక్కు వెళ్లిన అందరి రక్త నమూనాలను పరీక్షించాలని నిర్ణయించారు.
'దాదాపు 40 హెచ్ఐవీ కేసులు బయటకు వచ్చాయి. ప్రతీ ఒక్కరినీ పరీక్షిస్తే దాదాపు 500మందికి ఈ వ్యాధి సోకినట్లు తేలవచ్చు. తమకున్న రోగాలను నయం చేసుకునేందుకు ఆస్పత్రికి వెళితే.. అక్కడి డాక్టర్ ఒకే సిరంజీని అందరికీ వాడటమే దీనికి కారణం' అని బంగార్ మావ్ సిటీ కౌన్సిల్ సునీల్ తెలిపారు.
తాము హెల్త్ క్యాంపులు పెట్టిన సమయంలో ఈ విషయం బయటకు వచ్చిందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ ప్రమోద్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆస్పత్రి వైద్యుల లైసెన్స్లను రద్దు చేశామని, విచారణ కొనసాగుతోందని ఆరోగ్యశాఖ మంత్రి సిద్దార్థ నాథ్ సింగ్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన ట్రక్ డ్రైవర్ల నుంచి వైరస్ వ్యాపించి ఉండవచ్చని ఆయన తెలిపారు.
కాగా, రాజేంద్ర కుమార్ అనే నకిలీ డాక్టర్ వల్లే 40మందికి హెచ్ఐవీ సోకిందని విచారణాధికారులు తాజాగా తేల్చారు. దీని వల్లే వీరందరికీ హెచ్ఐవీ సోకినట్లు విచారణ నివేదిక వెల్లడించింది. దీంతో సదరు వైద్యుడిపై కేసు నమోదు చేశారు.