ఢిల్లీ వాయు కాలుష్యం ఎఫెక్ట్: దేశ రాజధానిని వీడాలనుకుంటున్న 40 శాతం ప్రజలు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ప్రజలు బయటికిరాలేని పరిస్థితి నెలకొంది. గురువారం రాత్రి నుంచి నమోదైన కాలుష్యం స్థాయిలు మరింత దిగజారి తొలిసారిగా వెయ్యి పాయింట్లు దాటాయి. దీంతో ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాఠశాలలకు సెలవులను కూడా ప్రకటించారు.
దేశ రాజధానిని వీడాలనుకుంటున్న 40శాతం మంది ప్రజలు
ఢిల్లీ వాతావరణం మొత్తం విషపూరితంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో నివాసం ఉంటున్న ప్రజలు తమ నివాసాలను విడిచిపెట్టి ఇతర నగరాలకు వెళ్లాలనే యోచనలో ఉన్నారు. దాదాపు 40శాతం మంది ప్రజలు తమ నివాసాలను విడిచి వెళ్లాలనుకుంటున్నట్లు తాజాగా ఓ సర్వే తేల్చింది.
కాలుష్యం ఎక్కువగా ఉన్న కాలంలో ఇతర ప్రాంతాలకు వెళ్లాలని 16శాతం ప్రజలు అనుకుంటున్నట్లు తేలింది.
ఎయిర్ ఫ్యూరిఫైయర్స్, మాస్కులు వాడుతామంటూ..
17వేల మందికిపైగా ప్రజల అభిప్రాయాలను తీసుకుని ఈ సర్వే నిర్వహించగా.. కాలుష్యం వల్ల ఇబ్బందులు ఎదురైనప్పటికీ తమకు ఈ ప్రాంతంను వీడి ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేదని స్పష్టంచేశారు. దాదాపు 40శాతానికిపైగా ప్రజలు కాలుష్యం కారణంగా ఢిల్లీ, ఎన్సీఆర్ను వదిలి ఇతర నగరాలకు వెళ్లాలని నిర్ణయించుకోగా.. 31శాతం మంది ప్రజలు మాత్రం ఈ ప్రాంతంలోనే ఉంటూ ఎయిర్ ఫ్యూరిఫైయర్స్, మాస్కులు వాడుకుంటామని చెబుతుండటం గమనార్హం. ఈ మేరకు విషయాలు లోకల్ సర్కిల్స్ అనే సర్వేలో తేలింది.
మరో మార్గం లేదంటూ 13శాతం మంది..
వాయు కాలుష్యం విషపూరితంగా మారిన సమయాల్లో మాత్రం వేరే ప్రాంతాలకు వెళ్లి.. ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి చేరుకుంటామని 16శాతం మంది ప్రజలు చెప్పారు. మరో 13శాతం మంది మాత్రం తమకు ఇక్కడ ఉండటం తప్ప మరో మార్గం లేదని తెలిపారు. కాలుష్యం ఉన్నప్పటికీ తాము ఇక్కడే ఉంటామన్నారు. కాలుష్యం కారణంగా ఇప్పటికే 13 శాతం మంది ఆస్పత్రుల పాలవ్వగా, 29శాతం మంది ప్రజలు వైద్యులను సంప్రదించామని చెప్పుకొచ్చారు.
44శాతం మందికి అనారోగ్యం
కాలుష్య కారణంగా 44శాతం మంది అనారోగ్యానికి గురయ్యామని వెల్లడించారు. కేవలం 14 శాతం మంది మాత్రమే కాలుష్యం కారణంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోలేదని చెప్పడం గమనార్హం. ఆదివారం ఉదయం వర్షం పడటంతో ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరిగింది. సెంట్రల్ పొల్యూషన్ సెంట్రల్ బోర్డ్(సీపీసీబీ) డేటా, ది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) ప్రకారం ఢిల్లీ కాలుష్యం ఉదయం 11గంటలకు 486 పాయింట్లు ఉంది. పూస(495), ఐటీఓ(494), ముండ్కా, పంజాబీ బాగ్(493) ప్రాంతాల్లో కాలుష్యం అధికంగా ఉంది.