శాంతి పూజ పేరుతో 400 గొర్రెలు బలి .. కరోనాతో పాటు మూఢ నమ్మకాలు పెరుగుతున్నాయిగా !!
కరోనావైరస్ వ్యాప్తితో పాటే కరోనా వైరస్ నేపధ్యంలో మూఢనమ్మకాల వ్యాప్తి కూడా జోరుగా జరుగుతుంది. ఇటీవల నరబలి ఇస్తే కరోనా రాదని కలలో కనిపించి దేవుడు చెప్పాడని ఒక వ్యక్తిని హతమారిస్తే ఇక ఇప్పుడు కరోనా తగ్గాలంటే శాంతి పూజలు చెయ్యాలంటూ ఒక గ్రామ ప్రజలు ఏకంగా 400 గొర్రెలను బలిచ్చారు . అమాయక మూగ జీవాల ప్రాణాలు తీశారు .
గ్రామాలు , పట్టణాలు అన్న తేడా లేకుండా పెరుగుతున్న మూఢ నమ్మకాలు
కరోనా వ్యాప్తి నేపధ్యంలో గ్రామాలు ,పట్టణాలు అన్న తేడా లేకుండా మూఢనమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక కరోనా రాకుండా ఉండాలంటే ఎలా అని ఆలోచిస్తున్న జనాలకు వింత వింత ఆలోచనలు వస్తున్నాయి. కరోనా రాకుండా ఉండాలంటే పూజలు చెయ్యటం,వేపచెట్టుకు నీళ్ళు పోయటం, గుండ్లు గీయించుకోవటం వంటి ఉదంతాలు బాగా పెరిగాయి. ఇక తాజాగా కరోనా రాకుండా ఉండాలంటే శాంతిపూజలు చెయ్యాలంటూ జరిగిన ప్రచారంతో ఒక గ్రామవాసులు మూగజీవాలను బలిచ్చారు.
శాంతిపూజల పేరుతో 400 గొర్రెల బలి.. గ్రామానికి కరోనా రాదని నమ్మకం
శాంతిపూజల పేరుతో 400 గొర్రెలను బలి ఇచ్చిన ఘటన జార్ఖండ్లోని కోడెర్మా జిల్లాలో కలకలం సృష్టించింది. ప్రపంచం మొత్తం కరోనావైరస్ తో వణికిపోతున్న సమయంలో కరోనా బారి నుండి కాపాడుకోవటం కోసం గొర్రెలను బలివ్వాలని చంద్వారా బ్లాక్ పరిధిలో గల ఉర్వాన్ గ్రామంలోని అమ్మవారి ఆలయంలో గొర్రెల ప్రాణం తీశారు. కరోనాను శాంతింపచేయడానికంటూ పూజలు నిర్వహించిన ఉర్వాన్ గ్రామ స్థానికులు పెద్దఎత్తున కోళ్లతో పాటు 400 గొర్రెలను బలిచ్చారు. ఇలా చేస్తే కరోనా నుండి తమ గ్రామానికి విముక్తి కలుగుతుంది అని వారు భావించారు .ఇక ఇందుకోసం ఆలయానికి బారులు తీరిన గ్రామస్తులు కనీసం భౌతిక దూరం నియమాన్ని కూడా పాటించలేదని తెలుస్తుంది .
పెరుగుతున్న మూఢ నమ్మకాలు కంట్రోల్ చెయ్యకుంటే కొత్త కష్టాలు
ఇక కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతున్న తరుణంలో మూఢ నమ్మకాలను విశ్వసించే ప్రజలు ఎవరు ఏది చెప్తే వాటిని ఠక్కున నమ్ముతున్నారు . ఇక మరోపక్క ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. ఇక ఇదే సమయంలో పెరుగుతున్న మూఢ నమ్మకాలు తలనొప్పిగా మారాయి. ఒకవైపు అసత్య ప్రచారాలను నమ్మవద్దని అధికారులు, వైద్యులు, ప్రభుత్వం కూడా హెచ్చరిస్తోన్నా ఇలాంటి ఘటనలు జరుగుతున్న తీరు విస్మయాన్ని కలిగిస్తుంది.