హెలికాప్టర్కు నిచ్చెన వేసి శని గుళ్లో దిగుతాం: తృప్తి
పుణే: దాదాపు 400 మంది మహిళలు పుణే నుంచి శని సింగాపురం బయలుదేరారు. శని దేవాలయంలోకి మహిళల ప్రవేశం నిషిద్ధమన్న స్త్రీ వ్యతిరేక సంప్రదాయాన్ని నిరసిస్తూ వారు ఆలయంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు.
తమను శని దేవాలయంలోకి అనుమతించకపోతే తాము హెలికాప్టర్ ద్వారా అయినా దేవాలయంలోకి ప్రవేశిస్తామని వారు చెబుతున్నారు. పుణే నుంచి దాదాపు 400 మంది మహిళలు మంగళవారం నాడు శని సింగాపురం బయలుదేరారు.
4వేల మంది నివసించే శని సింగాపురం.. ముంబైకి 330 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ శని దేవాలయంలోకి మహిళలకు అనుమతి లేదు. ఇది ఇక్కడి సంప్రదాయం. మహిళలకు అనుమతి లేకపోవడాన్ని చాలామంది స్త్రీలు ప్రశ్నిస్తున్నారు. దీంతో శని దేవాలయంలోకి ఎలాగైనా వెళ్లాలని ఆ మహిళలు నిర్ణయించుకున్నారు.
దాదాపు ఆరు దశాబ్దాల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. తమకు కూడా శనీశ్వరుడిని పూజించే అవకాశం కల్పించాలని వారు చెబుతున్నారు.
భూమాత రణరాగిడి బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ మాట్లాడుతూ... తమను భూమార్గం ద్వారా ప్రవేశించనీయకుంటే హెలికాప్టర్ నుంచి నిచ్చెనలు వేసుకొని దేవాలయంలోకి ప్రవేశిస్తామంటున్నారు. తాము ఎవరికీ భయపడేది లేదని, అందరికీ సమాన హక్కులున్నాయన్నారు.