CAA ప్రక్రియ ప్రారంభించిన యూపీ సర్కార్..40వేల మంది ముస్లింయేతర వ్యక్తుల గుర్తింపు
లక్నో: ఓ వైపు దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతుండగా... మరోవైపు పౌరసత్వ సవరణ చట్టం అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పౌరసత్వ సవరణ చట్టం ప్రక్రియను ప్రారంభించిన తొలిరాష్ట్రంగా ఉత్తర్ప్రదేశ్ నిలిచింది. 19 రాష్ట్రాల్లో హిందూ శరణార్థులను గుర్తించిన యోగీ సర్కార్ వారి వివరాలతో కూడిన జాబితాను కేంద్ర హోంశాఖకు పంపించింది. యూపీ సర్కార్ కేంద్రానికి ఇచ్చిన నివేదిక ప్రకారం 40వేల ముస్లింయేతర వలసదారులు యూపీలో నివసిస్తున్నట్లు గుర్తించింది. ఇందులో 30 వేల నుంచి 35 వేల వరకు ఒక్క ఫిలిభిట్ జిల్లాలోనే ఉన్నట్లు గుర్తించింది.
అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి వచ్చిన శరణార్థుల వ్యక్తిగత విషయాలను వారు ఇక్కడికి వచ్చేలా చేసిన పరిణామాలను వివరిస్తూ నివేదికలో పొందుపర్చింది. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని యూపీ మంత్రి శ్రీకాంత్ శర్మ చెప్పారు. ఇదే నివేదికను కేంద్రహోంశాఖకు పంపిస్తామని వెల్లడించారు. శరణార్థులుగా భారత్కు వచ్చిన వారిలో అత్యధికులు పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుంచి వచ్చినవారిగా ప్రభుత్వం గుర్తించింది. వారు ఎలాంటి పరిణామాల మధ్య భారత్కు వచ్చారో తెలుసుకుని వారి కథను నివేదికలో పొందుపర్చింది.
ముస్లిం మెజార్టీ దేశాల్లో మైనార్టీలుగా ఉన్న హిందువులు అణిచివేతకు గురవుతుండటంతో భారతదేశానికి ఉన్న మంచి సంప్రదాయం అనుగుణంగా కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంను అమలు చేస్తున్నట్లు సీఎం యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు. మొరాదాబాద్లో కూడా పౌరసత్వ సవరణ చట్టం డ్రైవ్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య విపక్షాలపై ధ్వజమెత్తారు. పౌరసత్వ సవరణ చట్టంపై అనవసర రాద్దాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విపక్ష పార్టీలపై మండిపడ్డారు కేశవ్ ప్రసాద్.
పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. గతనెలలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన వాగ్వాదం, తోపులాటలో ఒక్క యూపీలోనే 19 మంది మృతి చెందగా చాలామందికి గాయాలయ్యాయి.