చైనా వుహాన్ నుంచి భారత్కు తిరిగొచ్చిన 406 మందికీ కరోనావైరస్ నెగెటివ్
న్యూఢిల్లీ: కరోనావైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య వందల నుంచి వేలకు చేరుకుంటోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు లక్ష మంది వరకు ఈ వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలో చైనాలోని వుహాన్ నుంచి వెనక్కి రప్పించిన మొత్తం 406 మంది భారతీయుల్లో ఏ ఒక్కరికీ కూడా కొవిడ్-19(కరోనావైరస్)సోకలేదని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) అధికారులు స్పష్టం చేశారు. ఐటీబీపీ కేంద్రంలో ఉన్న వాందరికీ పరీక్షలు నిర్వహంచగా కొవిడ్ నెగెటివ్గా వచ్చిందని తెలిపారు.
వుహాన్ నుంచి వెనక్కి తీసుకొచ్చిన 406 మందికి సంబంధించి తుది ఆరోగ్య నివేదికలు శుక్రవారం వైద్యుల చేతికి అందాయన్నారు. ఆ నివేదికల్లో 406 మందికి కూడా కరోనావైరస్ నెగెటివ్ అనే వచ్చిందని తెలిపారు. ఆరోగ్య శాఖ సూచనల మేరకు వారందరినీ సోమవారం నుంచి విడతల వారీగా విడుదల చేస్తామని చెప్పారు.
కరోనావైరస్కు కేంద్రంగా ఉన్నచైనాలోని వుహాన్ నగరం నుంచి 406 మంది భారతీయులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానంలో తిరిగి స్వదేశానికి తీసుకొచ్చింది. అప్పటి నుంచి వారు ఐటీబీపీ కేంద్రంలోనే ఉన్నారు.
కాగా, చైనాలో కరోనావైరస్ నివారణకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆ వ్యాధి ప్రబలుతూనే ఉంది. చైనాలో ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడి 1662 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. సుమారు లక్ష మంది వరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్ పొందుతున్నారని తెలిపారు. చైనాతోపాట ప్రపంచంలోని 26 దేశాల్లో కరోనావైరస్ ప్రభావం ఉండటం గమనార్హం. మనదేశంలోనూ మూడు కేసులను గుర్తించి వారికి చికిత్స అందిస్తున్నారు.