నాటుసారా కాటు: 72 గంటల్లో 44 మంది మృత్యువాత
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించి అయిదు కాదు, పది కాదు ఏకంగా 44 మంది మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని సహరాన్ పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మూడురోజుల వ్యవధిలో 44 మంది మరణించారు. అధికారులు మాత్రం మృతుల సంఖ్యను తగ్గించి చూపుతున్నారు. 36 మందే మరణించినట్లు చెబుతున్నారు. కల్తీ మద్యాన్ని సేవించిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పలువురు బాధితులు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
సహరాన్ పూర్ జిల్లాలోని రామ్ గఢ్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తమ సమీప బంధువు అంత్యక్రియలకు హాజరు కావడానికి పొరుగునే ఉన్న ఉత్తరాఖండ్ కు వెళ్లారు. అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం అక్కడే నాటుసారా సేవించారు. తిరుగు ప్రయాణంలో వారు కొన్ని సారా పాకెట్లను అక్రమంగా తమ వెంట తెచ్చుకున్నారు. వాటిని రామ్ గఢ్ లో విక్రయించారు. ఈ మదం బిహార్ లో తయారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి అక్రమంగా ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ లకు తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు.
బిహార్ లో మద్య నిషేధం అమల్లో ఉంది. దీనితో అక్కడ సారాను విక్రయించే అవకాశం లేకపోవడం వల్ల అక్రమంగా పొరుగు రాష్ట్రాలకు సారా పాకెట్లను తరలిస్తున్నారని చెబుతున్నారు. మూడు రోజుల వ్యవధిలో 44 మంది మరణించడం, పలువురి ప్రాణాల్లో గాల్లో దీపాలుగా ఉండటం ఉత్తర్ ప్రదేశ్ లో ప్రకంపనలు రేపింది. నాటుసారాను విక్రయాలపై నిఘా పెట్టారు. రామ్ గఢ్ కు అవి ఎలా చేరాయనే అంశంపై కూలంకషంగా దర్యాప్తు చేస్తున్నారు.
నాటుసారా, మద్యం తయారీదారులన వదిలి పెట్టేది లేదని సహరాన్ పూర్ జిల్లా ఎస్పీ దినేష్ కుమార్ తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లల్లో వారు ఎక్కడ ఉన్నా అరెస్టు చేస్తామని అన్నారు. మరణాలపై తీవ్రంగా స్పందించిన యూపీ ప్రభుత్వం ఖుషీనగర్ జిల్లా ఎక్సైజ్ అధికారిని సస్పెండ్ చేసింది. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న వారిగా అనుమానిస్తున్న 30 మందిని అరెస్టు చేశారు పోలీసులు.