ఇండియాలో గత 24 గంటల్లో 45,369 కొత్త కేసులు.. ఢిల్లీ , కేరళ , మహారాష్ట్రలలో కరోనా పంజా
తగ్గినట్టే తగ్గి కరోనా కేసులు మళ్లీ నిదానంగా పెరుగుతున్నాయి . ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి చలికాలంలో విజృంభిస్తుంది అని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక మన దేశంలో చూస్తే కరోనా ముఖ్యంగా ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇక తాజాగా కరోనా కేసుల విషయానికి వస్తే ఇండియాలో గత 24 గంటల్లో 45,369 కొత్త కేసులు నమోదయినట్లుగా తెలుస్తుంది. దీంతో భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 89,58,143 కు చేరుకుంది.
ఢిల్లీలో గత 24 గంటల్లో 7,486 కరోనా కేసులు
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4,42,739 కేసులు యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకూ కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 83,81,770 గా ఉంది. గత 24 గంటల్లో కరోనా నుండి 48 ,675 మంది కోలుకున్నట్లుగా సమాచారం. కరోనా కారణంగా 1,31,618 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా చూస్తే ఢిల్లీలోనే అత్యధికంగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీ లో గత 24 గంటల్లో 7,486 కరోనా కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గత 24 గంటల్లో ఢిల్లీలో 131 మరణాలు.. ఆందోళనలో ఢిల్లీ సర్కార్ ...
ఇప్పటి వరకూ ఢిల్లీలో మొత్తం 5,03,124 కేసులు నమోదు కాగా 7,943 మూడు మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో ఢిల్లీలో 131 మరణాలు సంభవించినట్లు గా తెలుస్తుంది. కరోనా కట్టడి కోసం ఢిల్లీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండడం ఢిల్లీ సర్కార్ కు ఆందోళన కలిగిస్తుంది. ఢిల్లీ తర్వాత గత 24 గంటల్లో అత్యధిక కరోనా కేసులను నమోదు చేసింది కేరళ రాష్ట్రం.
కేరళలో గత 24 గంటల్లో 6419 కరోనా కొత్త కేసులు
కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 6,419 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళ రాష్ట్రంలోనూ కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటివరకు కేరళ రాష్ట్రంలో మొత్తం కేసులను చూస్తే 5,39,920 కేసులు నమోదు కాగా 1,943 మంది ఇప్పటివరకు కరోనా కారణంగా కేరళ రాష్ట్రంలో మృతి చెందారు. గత 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో మృతుల సంఖ్య 28 గా ఉంది. కేరళ తర్వాత గత 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదు చేసిన రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది.
Recommended Video
కొత్త కేసుల నమోదులో గత 24 గంటల్లో మూడో స్థానంలో మహారాష్ట్ర .. గత 24 గంటల్లో 5,011 కేసులు
దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉన్నప్పటికీ , నిన్న ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదు చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 5,011 కరోనా కేసులు నమోదు కాగా 100 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు మొత్తం 17,57,520 కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం కరోనా కారణంగా మహారాష్ట్రలో 46,202 మంది మృతి చెందారు. గత మూడు నాలుగు రోజుల క్రితం కేసుల తగ్గుదల కనిపించినా మళ్ళీ క్రమంగా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది .