విస్తుపోవాల్సిందే!: మహిళలపై నేరాల్లో 48మంది ఎంపీలు/ఎమ్మెల్యేలు, బీజేపీ టాప్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నవేళ దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆశ్చర్యంగా.. రాజకీయ నాయకుల్లోనూ నేరస్తులకు కొదువ లేదని తాజాగా ఓ క్రైమ్ రిపోర్ట్ బయటపెట్టింది. దేశవ్యాప్తంగా 48మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు మహిళల పట్ల నేరాలకు పాల్పడినవారేనని ఆ నివేదిక పేర్కొంది. ఇటీవలి ఉనావ్ రేప్ సంఘటనలో నిందితుడైన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ పేరును కూడా ఇందులో పేర్కొంది.
ఆ లిస్టులో బీజేపీ టాప్:
మొత్తం 1580మంది ఎంపీలు/ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉండగా.. అందులో 45మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మహిళల పట్ల నేరాలకు పాల్పడినవారని ప్రజాస్వామిక సంస్కరణల సంఘం(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. వీరిపై మహిళల అక్రమ రవాణా, కిడ్నాప్, లైంగిక వేధింపులు, గృహ హింస వంటి కేసులు ఉన్నాయని తెలిపింది.
అంతేకాదు, మహిళలపై నేరాలకు పాల్పడినవారిలో అత్యధికంగా బీజేపీలోనే 12మంది నేరస్తులైన ఎమ్మెల్యేలు/ఎంపీలు ఉన్నారని పేర్కొంది. ఆ తర్వాత శివసేన-6, తృణమూల్ కాంగ్రెస్-6 పార్టీలు ఉన్నాయి.
ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించాకే..:
దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు/ఎంపీల ఎన్నికల అఫిడవిట్లు పరిశీలించిన తర్వాతే ఈ నివేదికను వెల్లడించినట్టు చెప్పింది. మొత్తం 4896 అఫిడవిట్లకు గాను, 4845 అఫిడవిట్లను పరిశీలించినట్టు తెలిపింది.
'అన్ని రాజకీయ పార్టీలు మహిళల పట్ల నేరాలకు పాల్పడినవాళ్లకు టికెట్లు ఇచ్చాయి. అందులోనూ అత్యాచార కేసుల్లో నిందితులుగా ఉన్నవాళ్లకూ టికెట్లు ఇచ్చాయి. మహిళా భద్రతకు ఇదో ప్రతిబంధకం.' అని నివేదిక వెల్లడించింది.
మహారాష్ట్ర టాప్..:
మహిళల పట్ల నేరాలకు పాల్పడిన ప్రజా ప్రతినిధుల సంఖ్య పరంగా చూసుకుంటే.. మహారాష్ట్ర ముందు స్థానంలో ఉంది. ఇక్కడ 12మంది ఎంపీలు/ఎమ్మెల్యేలు మహిళల పట్ల నేరాలకు పాల్పడినవారి జాబితాలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్-11, ఒడిశా-5,ఆంధ్రప్రదేశ్-5 ఉన్నాయి.
కాగా, తీవ్ర నేరచరిత కలిగిన వ్యక్తులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని నిషేధించాలని జాతీయ ఎన్నికల పర్యవేక్షణ సంఘం(ఎన్ఈడబ్ల్యూ) ఇప్పటికే డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులపై నేరపూరిత కేసులు ఉంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో వాటిపై సత్వర విచారణ జరిపి నిజానిజాలను నిగ్గుతేల్చాలని ఆ సంస్థ కోరుతోంది.
నేరస్తులకు పెరుగుతున్న ప్రాధాన్యత..
గడిచిన ఐదేళ్లలో దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న పార్టీలు అత్యాచార కేసులున్న 26మంది అభ్యర్థులకు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చినట్టు నివేదిక చెబుతోంది. అదే సమయంలో అత్యాచార సంబంధిత కేసుల్లో ఉన్న మరో 14మంది స్వతంత్ర అభ్యర్థులు లోక్ సభ, రాజ్యసభకు పోటీ చేసినట్టు వెల్లడించింది. మొత్తంగా మహిళలపై నేరాలకు పాల్పడిన 327మందికి ఆయా రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చినట్టు తెలిపింది. అలాగే మహిళలపై నేరాలకు పాల్పడిన 118మంది స్వతంత్ర అభ్యర్థులు లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినట్టు పేర్కొంది.