Inspiration : మూడుసార్లు ఎమ్మెల్యే... 49 ఏళ్ల వయసులో పదో తరతగతి పరీక్షలకు హాజరు...
ఒడిశా అధికార పార్టీ ఎమ్మెల్యే పూర్ణ చంద్ర శుక్రవారం(జులై 30) పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. గంజాం జిల్లాలోని సురదా గర్ల్స్ హైస్కూల్ పరీక్షా కేంద్రంలో ఆయన పరీక్ష రాశారు. మిగతా విద్యార్థుల్లాగే సాదాసీదాగా పరీక్షా కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే.. తనకు కేటాయించిన స్థానంలో కూర్చొని పరీక్ష పూర్తి చేశారు. కొద్దిరోజులుగా ఎమ్మెల్యే పూర్ణ చంద్ర స్వల్ప అనారోగ్యంతో బాధపడుతుండటంతో పరీక్షా కేంద్రంలో మిగతా విద్యార్థులకు దూరంగా ఆయనకు సీటింగ్ ఏర్పాటు చేశారు.
నిజానికి కరోనా కారణంగా ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేసింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన కనీస మార్కులతో సంతృప్తి చెందనివారికి పరీక్ష రాసుకునే అవకాశం కల్పించింది. శుక్రవారం(జులై 27) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 504 పరీక్షా కేంద్రాల్లో 15వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పూర్ణ చంద్ర కూడా పరీక్షలకు హాజరయ్యారు.
ఎమ్మెల్యే పూర్ణచంద్ర 1972లో జన్మించారు. సురద అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేడీ తరుపున మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆయన తన చదువును తొమ్మిదో తరగతిలోనే ఆపేశారు. బరంపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిది వరకు చదువుకున్నారు. పదో తరగతి మంచి మార్కులతో పాస్ అవాలన్న లక్ష్యంతో ఆయన పరీక్షలకు హాజరవుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
గతంలోనూ పలుమార్లు పదో తరగతి పరీక్షలకు హాజరైన ఎమ్మెల్యే.. వాటిల్లో ఫెయిల్ అయ్యారు. ఈ విద్యా సంవత్సరం కరోనా కారణంగా ప్రభుత్వం అందరినీ పాస్ చేసినప్పటికీ... ఆ మార్కులతో సంతృప్తి చెందక పరీక్షలకు హాజరవుతున్నారు. 49 ఏళ్ల వయసులో పదో తరగతి పాస్ అయ్యేందుకు ఆయన పరీక్షలకు హాజరవడం.. స్కూల్ డ్రాపౌట్స్కు స్పూర్తినిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video
అగస్టు 5వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షకు 48 గంటల ముందే టీచర్లు,సిబ్బందికి కోవిడ్ టెస్టులు నిర్వహించారు. పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోపలికి అనుమతినిస్తున్నారు. ముఖానికి మాస్కులు,భౌతిక దూరం,హ్యాండ్ శానిటైజేషన్ తప్పనిసరి.