జమ్మూకాశ్మీర్లో 18 నెలల తర్వాత 4జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దాదాపు రెండు సంవత్సరాల తర్వాత 4జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలపై ఎప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే, తాజాగా, 4జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించనున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
జమ్మూకాశ్మీర్ వ్యాప్తంగా 4జీ మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు విద్యుత్, సమాచార శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రోహిత్ కన్సాల్ ట్విట్టర్ వేదికగా శుక్రవారం వెల్లడించారు. దీంతో సుమారు 18 నెలల తర్వాత జమ్మూకాశ్మీర్లో 4జీ ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి.
2019, ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్మూకాశ్మీర్ను రెండు కేంద్ర ప్రాంతాలుగా మారుస్తూ పార్లమెంటులో చట్టం చేసింది.
ఈ క్రమంలో ఎలాంటి ఘర్షణలు, ఉద్రిక్తతలకు తావులేకుండా భారీగా భద్రతా బలగాలను మోహరించడంతోపాటు ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను సుదీర్ఘంగా నిర్బంధంలో ఉంచింది. ఇంటర్నెట్ సేవలపైనా ఆంక్షలు విధించింది. ఇప్పుడు పరిస్థితి కాస్త అదుపులోనే ఉండటంతో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది. మాజీ ముఖ్యమంత్రులను కూడా నిర్బంధం నుంచి ఇటీవలే విముక్తులను చేసింది.
కాగా, రాష్ట్రంలో 4జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించడం పట్ల జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. 4జీ ముబారక్ అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 2019, ఆగస్టు తర్వాత మళ్లీ ఇప్పుడే తొలిసారి 4జీ సేవలను తొలిసారి అందుకుంటున్నట్లు తెలిపారు.