జమ్మూకశ్మీర్లో భూకంపం... రెండు జిల్లాలో భూప్రకంపనలు... రిక్టర్ స్కేలుగా 5.1గా నమోదు...
జమ్మూకశ్మీర్లోని కిష్వార్ జిల్లాలో సోమవారం(జనవరి 12) రాత్రి 7గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. ఉదంపూర్ జిల్లాలోనూ పలుచోట్ల భూప్రకంపనలు సంభవించాయి. భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పలుచోట్ల ఇంటి కిటికీలు పగిలిపోవడం,షెల్ఫ్స్లోని వస్తువులు కిందపడటం జరిగాయి.
కిష్వార్కి 18కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలెవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కిష్వార్ జిల్లా మెజిస్ట్రేట్ పేర్కొన్నారు. భూకంపం కారణంగా ఎక్కడైనా ఆస్తి నష్టం జరిగినట్లు తమ దృష్టికొస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లు,స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చారు. అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారని ప్రజలు కంగారుపడవద్దని చెప్పారు.
రెండు రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలోనూ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 4.2గా నమోదైనట్లు సిమ్లా వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాత్రి 8.21గం. సమయంలో భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలిపింది. అయితే ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని సిమ్లా వాతావరణ కేంద్రం డైరెక్టర్ మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. కాంగ్రా జిల్లాకి ఈశాన్యం వైపు కెరారీ వద్ద 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు గుర్తించారు. కాంగ్రా జిల్లా పరిసర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువ భాగం అధిక భూకంప జోన్లో ఉండడంతో ఇక్కడ తరచూ స్వల్ప భూకంపాలు సంభవిస్తుంటాయి.