జమ్మూకాశ్మీర్ నుంచి బయటికెళ్లిన 5,300 ఫ్యామిలీలకు భారీ పరిహారం
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ నుంచి వేరే ప్రదేశంలోకి వెళ్లిన వారి జాబితాలో మరో 5000 కుటుంబాలకుపైగా స్థానం కల్పించారు. వారందరు కూడా ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద ఇప్పుడు రూ. 5.5లక్షల పరిహారం పొందనున్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) నుంచి జమ్మూకాశ్మీర్ కాక మిగితా రాష్ట్రాలకు వెళ్లిపోయిన కుటుంబాలకు ఈ పరిహారం అందిస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.
చరిత్రలో జరిగిన పొరపాట్లను సవరించేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. జమ్మూకాశ్మీర్ నుంచి తమ నివాసాలను వదులుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన కుటుంబాలకు న్యాయం చేస్తున్నామని చెప్పారు. మొత్తం 5,300 కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ. 5.5లక్షల పరిహారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి డెవలప్ మెంట్ ప్యాకేజీ అనేది ఒక గొడుగులా నిలుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన కుటుంబాలకు రూ. 5.5లక్షలను పరిహారంగా ఇస్తున్నామని పునరుద్ఘాటించారు.
అంతేగాక, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కేంద్రం తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్(డీఏ)ను 5 శాతం పెంచినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, మరో 62 లక్షల మంది పెన్షనర్లు లబ్ధిపొందనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని పెంచాలన్న నిర్ణయాన్ని కేబినెట్ సమావేశంలో తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, పెంచిన మొత్తంతో కలిపి ప్రస్తుతం డీఏ 17శాతానికి చేరుతుంది. ఇది ఉద్యోగులకు దీపావళి బహుమతి అని కేంద్ర మంత్రి తెలిపారు. కాగా, ప్రతి ఏాడాది ప్రభుత్వ ఖాజానాపై సుమారు 16వేల కోట్ల అదనపు భారం పడనుంది.
కిసాన్ సమ్మాన్ కింద ఇచ్చే రైతు బంధు డబ్బుల కోసం ఆధార్ అనుసంధాన పక్రియను నవంబర్ 30వ తేదీ వరకు సడిలిస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.