వైద్యులు, పోలీసులపై దాడి చేసిన వారిలో ఐదుగురికి కరోనా పాజిటివ్: పీఎస్ మూసివేత
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్లో వైద్య బృందం, పోలీసులపై రాళ్లు రువ్విన కేసులో అరెస్టైన వారిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ కేసులో నిందితులందరినీ కరోనా క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అంతేగాక, వారిని ఉంచిన నగ్ఫని పోలీస్ స్టేషన్ ను మూసివేశారు.
మొరాదాబాద్లో కరోనా అనుమానితుడు ఉన్నట్లు గుర్తించిన వైద్య బృందం ఏప్రిల్ 15న పరీక్షలు నిర్వహించేందుకు అక్కడికి వెళ్లింది. దీంతో వైద్య బృందంతోపాటు వారి వెంట వచ్చి పోలీసులపైనా స్థానికులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఓ వైద్యుడు, ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అంబులెన్స్ ధ్వంసమైంది.
ఈ దాడి ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, కఠని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగినపోలీసులు దాడి ఘటనతో సంబంధం ఉన్న 10 మంది పురుషులు, 8 మంది మహిళలను అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం నిందితులను లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. కాగా, 18 మందిలో తాజాగా ఐదుగురు పురుషులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యిందని ఆస్పత్రి ప్రధాన వైద్యాధికారి ఎంజీ గార్గ్ తెలిపారు. కరోనా పాజిటివ్ వ్యక్తులను ఐసోలేషన్ వార్డుకు తరలించి, వారిని కలిసిన వారందర్నీ క్వారంటైన్ తరలించినట్లు వెల్లడించారు.