యువతితో స్నేహం: ఫ్రెండ్స్తో కలిసి చితక్కొట్టిన సోదరుడు, యువకుడు మృతి, ఐదుగురి అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. యువతితో స్నేహం అతని ప్రాణాలు తీసింది. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురుని అరెస్ట్ చేశారు. ఢిల్లీలో జరిగిన ఘటన కలకలం రేపింది. ఆదర్శనగర్కు చెందిన రాహుల్ రాజ్పుత్ ఢిల్లీ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ రెండో సెకండ్ ఈయర్ చదువుతున్నాడు. తమ ప్రాంతానికి చెందిన అమ్మాయితో గత రెండేళ్లుగా ఫ్రెండ్ షిప్ చేస్తున్నాడు.
వారి స్నేహంపై యువతి కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. అయినా వారు వినిపించుకోలేదు. దీంతో యువతి సోదరుడు బుధవారం రాజ్పుత్ని నందా రోడ్డు వద్దకు పిలిచాడు. చెల్లితో స్నేహం ఆపాలంటూ మరో ముగ్గురితో కలిసి చితకబాది..అక్కడ నుంచి జారుకున్నాడు. తర్వాత రాహుల్ కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. యువతి అన్న, అతని నలుగురు స్నేహితులను అరెస్టు చేశామని వాయువ్య ఢిల్లీ డీసీపీ విజయంత ఆర్యా పేర్కొన్నారు.
Recommended Video
పోస్టుమార్టం రిపోర్టులో రాహుల్కు లోపల తీవ్ర గాయాలయ్యాయని తేలింది. రాహుల్ ప్లీహానికి చీలిక రావడంతో చనిపోయాడని డాక్టర్లు చెప్పారని డీసీపీ తెలిపారు. ఇది రెండు కుటుంబాల మధ్య ఘర్షణ మాత్రమేనని.. దీనిపై ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసి ఉద్రిక్తతలు రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు. అయితే తొలుత కేసు నమోదు చేయడంలో పోలీసులు జాప్యం చేశారని రాహుల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపించారు. దాడి గురించి తెలియగా రాహుల్ ఒంటిపై గాయం కాలేదని కేసు నమోదు చేయలేదని చెప్పారు.